జగన్ బలం ఏమిటో ఇప్పుడు కాదు ఎప్పుడో టిడిపి అధినేత చంద్రబాబుకు అర్థం అయిపోయింది.ఒంటరిగా మరో సారి ఎన్నికలకు వెళ్తే మరెంతటి ఘోరమైన ఇబ్బందులు ఎదుర్కోవాలో బాగా అర్ధం అయ్యింది.
అందుకే 2019 ఎన్నికల ముందు బిజెపి, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నించినా, అది సాధ్యం కాలేదు.అందుకే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది.
కానీ ఫలితం మాత్రం తీవ్ర నిరాశ కలిగించింది.అయినా తన రాజకీయ ఎత్తుగడలతో వైసీపీ హవాను పూర్తిగా తగ్గించగలను అనే నమ్మకంతో ఉంటూ వచ్చారు.
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ, పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ, టిడిపిని 2024 నాటికి మరింత ఉత్సాహంగా అధికారం వైపు నడిపించగలను అనే నమ్మకంతో బాబు ఉన్నారు.
కానీ ఆ అవకాశం ఒంటరిగా వెళ్తే లభించదు అనే విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నారు.
జగన్ ప్రభుత్వం బలహీన పడకపోగా, ప్రజలు మరింత ఆదరణ పెంచుకుంటున్నట్టుగా ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు చూస్తే అర్థమవుతోంది.దీనికి తోడు పార్టీ కేడర్ లోనూ వైసీపీ ప్రభుత్వం అంటే భయాందోళన కలగడం, పార్టీలో పేరున్న నాయకులు అంతా వివిధ కేసుల్లో అరెస్టులు కావడం, అవినీతి కేసులలో విచారణను ఎదుర్కోవడం, దానికి సంబంధించి ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలపై వైసిపి ప్రభుత్వం దృష్టి పెట్టడం, ఇలా ఎన్నో కారణాలతో టిడిపి క్యాడర్ అంతా సైలెంట్ అయిపోయారు.
బాబు సైతం చాలా కాలంగా పార్టీ నేతల విషయంలో మౌనంగా ఉంటున్నారు.ఎవరిపైనా ఒత్తిడి పెంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరడం లేదు. సోషల్ మీడియా ద్వారా లోకేష్ , చంద్రబాబు వంటి వారు వివిధ సమస్యలపై స్పందిస్తున్నారు.అయితే ఇదంతా బాబు ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నారట.2024 నాటికి ఏదో రకంగా బిజెపి, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బాబు బలంగా నమ్మడమే కారణమట.ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పనిసరిగా గతం కంటే ఎక్కువ స్థానాలను త్యాగం చేయాల్సి వస్తుందని, పొత్తులో భాగంగా వారికి సీట్లు కేటాయించాలని ముందుగానే ఆలోచించి, ఏ స్థానాలను ఆ పార్టీలకు ఇవ్వాలి అనే విషయం పై ఇప్పటి నుంచి దృష్టి పెట్టారట.
టిడిపి గెలవగలిగిన స్థానాలు ఏంటి అనే విషయంపైన బాబు ఒక ప్రైవేటు సర్వే చేయిస్తున్నారట.ఆ సర్వే ప్రకారం 100 స్థానాల్లో టిడిపి అభ్యర్థులను పోటీకి దింపి, మిగతా నియోజకవర్గాలను బిజెపి, జనసేన పార్టీలకు కేటాయించాలనేది బాబు వ్యూహంగా తెలుస్తోంది.
ఈ మేరకు ఢిల్లీలో తనకు ఉన్న పలుకుబడి ద్వారా కేంద్ర బిజెపి పెద్దలతో పొత్తు విషయమై ఒక అంగీకారానికి రావాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట.కాకపోతే బిజెపి కేంద్ర పెద్దలు కరోనా వ్యవహారంలో బిజీగా ఉండటంతో దీనిపై ఒక స్పష్టత రావడం లేదని తెలుస్తోంది.
అయినా ఏదో రకంగా బిజెపి, జనసేన పార్టీలను ఒప్పించగలను అనే నమ్మకంతో బాబు ఉండటంతోనే, ప్రైవేట్ సర్వే కి దిగినట్లు సమాచారం.