మళ్లీ తెలంగాణ సీఎం గా కేటీఆర్ పేరు ప్రస్తావనకు వస్తోంది.అసలు గత కొద్దిరోజులుగా టిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న గందరగోళానికి అసలు కారణం ఇదేనని, టిఆర్ఎస్ పార్టీలో పూర్తిగా కేటీఆర్ వర్గం ఉండాలని, ఎవరూ ఆయన నాయకత్వాన్ని శంకించడం కానీ, చులకన భావంతో మాట్లాడడం కానీ చేయకూడదు అనేది కెసిఆర్ అభిప్రాయంగా కనిపిస్తోంది.
పార్టీలో తన తరువాత కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కెసిఆర్ చేయగలిగారు.ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించి ఆయన ప్రాధాన్యం ఏంటో చూపించారు.
అయినా కొంతమంది సీనియర్ నాయకుల వ్యవహార శైలి కారణంగా ఎప్పటికైనా కేటీఆర్ కు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనే ఆలోచనతో చాలాకాలం నుంచి కేసీఆర్ ఉంటూ వస్తున్నారు.దీనిలో భాగంగానే మంత్రి ఈటెల రాజేందర్ అవినీతి వ్యవహారాలు బయటకు రావడం , ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం వంటివి చోటు చేసుకున్నాయని, అలాగే మరికొంత మంది మంత్రులు కేటీఆర్ విషయంలో చులకన భావంతో ఉండడంతో వారిని సైతం తప్పిస్తారు అనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఎన్నికల తంతు ముగియడం, నాగార్జునసాగర్ లో గెలుపు ఉత్సాహం కనిపిస్తూ ఉండటంతో, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట.
కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్, మంత్రి మల్లారెడ్డి తో పాటు, మరికొంతమంది ని కెసిఆర్ తప్పిస్తారు అని ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా సీఎంగా కేటీఆర్ కు ప్రమోషన్ అప్పుడే కల్పిస్తారనే హడావుడి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ లో నెలకొంది.దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం ఏమీ లేదనే విషయం నిన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తేలిపోవడంతో, కేసీఆర్ లో బాగా ధీమా పెరిగిందని, అందుకే జాతీయ రాజకీయాల్లో ఆయన యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారని, మమతాబెనర్జీతో కలిసి జాతీయస్థాయిలో బలమైన కూటమి ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
అందుకే ముందుగా పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గం మొత్తాన్ని తప్పించి, పూర్తిగా మంత్రిమండలి తో పాటు పార్టీని ప్రక్షాళన చేసి , ఇక్కడ తమకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా చూసుకునేందుకు ఈటెల పై వేటు వేశారని ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.చాలాకాలం నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న కేటీఆర్ పట్టాభిషేకం అతి త్వరలోనే ఉండబోతుందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.