ఈటెల రాజేందర్ విషయంలో టిఆర్ఎస్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సమయంలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ గెలుపొందడం అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఎక్కడలేని ఆనందాన్ని కలిగించింది.
ఎందుకంటే ఇక్కడ గెలవడం ద్వారా టిఆర్ఎస్ పార్టీకి ఎన్నో సానుకూల అంశాలు ఏర్పడ్డాయి.ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలవడం, జిహెచ్ఎంసి ఫలితాలు పెద్దగా ఆనందం కలిగించలేకపోవడం వంటి అంశాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికార పార్టీకి నాగార్జునసాగర్ లో గెలుపు మంచి ఉత్సాహాన్ని కలిగించింది.
సరైన సమయంలో సరైన కిక్ లభించింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ని ఓడించి గెలవడం అంటే ఆషామాషీ కాదు.రాజకీయ ఉద్దండుడిగా ఈ నియోజకవర్గంపై పూర్తిగా పట్టు ఉన్న ఆయనను ఓడించేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.ఎన్నో రాజకీయ ఎత్తుగడలు , ఎన్నో సర్వేలు చేయించి మరీ భగత్ విజయానికి బాటలు వేశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం తో పాటు నోముల నర్సింహయ్య మరణంతో వచ్చిన సానుభూతి, భగత్ కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం , ఆయన పై పూర్తిగా క్లీన్ చీట్ ఉండడం ఇవన్నీ టిఆర్ఎస్ కు కలిసి వచ్చాయి.
ఇక కెసిఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో భారీ బహిరంగ సభ నిర్వహించి మరి ఈ నియోజకవర్గానికి అనేక వరాలు ఇవ్వడం, రాజకీయ ప్రత్యర్థుల బలహీనతలను కనిపెట్టడం అలాగే బిజెపి, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న అసంతృతు లను గుర్తించి , వారిని బుజ్జగించి టిఆర్ఎస్ లోకి తీసుకురావడం, ఈ నియోజకవర్గంలోని పార్టీ నాయకులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి భగత్ విజయానికి బాటలు వేశారు.దుబ్బాక ఉప ఎన్నికల లో జరిగిన పరాభవాన్ని గుర్తుంచుకుని కెసిఆర్ ముందు జాగ్రత్త పడడం తోనే ఈ విజయం వచ్చినట్టుగా కనిపిస్తోంది.