ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్.కరోనా కేసులు భారీగా పెరుగుతున్న ఇలాంటి టైం లో విద్యార్దుల తల్లిదండ్రులు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వారి డిమాండ్ తో పాటుగా హైకోర్ట్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని మంత్రి సురేష్ అన్నారు.
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే 10వ తరగతి, 11, 12వ తరగతిలకు సంబందించి దేశం మొత్తం వర్తించేలా నిబంధనలు లేవు అందుకే రాష్ట్రాలు ఎవరికి వారు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఇప్పటికే ఇంటర్ పరీక్షలను కొన్ని రాష్ట్రాలు రద్దు చేయగా మరికొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను పూర్తి చేశారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్ష కేంద్రాలను ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక బృందంతో పరీక్షలను నిర్వహించాలని అనుకున్నామని మంత్రి అన్నారు.
అయితే కోర్ట్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వాటికి గౌరమిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని చెప్పారు.ఇదే విషయాన్ని హైకోర్ట్ కు కూడా తెలియచేస్తామని అన్నారు మంత్రి సురేష్.
పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు ఎప్పుడన్నది కొత్త షెడ్యూల్ సిద్ధం చేస్తామని అన్నారు.