దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా అందరి చూపు మాత్రం బెంగాల్ పైనే ఉంది.ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడిచింది.
ఈ పోరులో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.దీంతో బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది.
మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా అడుగులు వేస్తోంది.పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది.
ప్రస్తుతం నేడు పశ్చిమ బెంగాల్ ఓట్ల లెక్కింపు పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగుతోంది.మొత్తం 23 జిల్లాలో 108 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది.
అన్ని కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.పోలీసులను భారీగా మోహరించారు.256 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి.
292 మంది అబ్జర్వర్లను నియమించారు.294 అసెంబ్లీ స్థానాలకు గానూ 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.మిగతా రెండు స్థానాల అభ్యర్థులు చనిపోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
కౌంటింగ్ విషయానికి వస్తే కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.మాస్కుల, శానిటైజర్లు వెంట తెచ్చుకున్నారు.ఏకంగా పీపీఈ కిట్లు ధరించి డ్యూటీకి వచ్చారు.పీపీఈ కిట్లలో ఉన్న వారిని చూసి అంతా విస్తుపోయారు.
వారంతా కరోనా రోగులైనా ఉండాలి లేదా ఆరోగ్య సిబ్బంది అయినా ఉండాలి అనుకున్నారు.కానీ వారంతా కౌంటింగ్ సిబ్బంది అని తెలిసి ఆశ్చర్యపోయారు.
ఇలాంటి ఘటనలు ముందు ముందు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో.