తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై రైతుల దగ్గరి నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను రాయించుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నడు లేనంత స్పీడ్ పెరిగి 24 గంటల్లో ఈ కేసు తాలూకూ విచారణ కూడా పూర్తి చేశారు.
కరోనా వైరస్ కంటే వేగంగా స్పందించడంతో ఇందులో ఉన్న నిజ నిజాలు ప్రజలకు ఏం అర్ధం కాలేదట.
అందుకే ఈటలకు మద్దతుగా రోడ్డెక్కినట్లుగా ప్రచారం జరుగుతుంది.ఇకపోతే ఈటల వ్యవహారంలో ఇప్పటికే పలువురు నేతలు స్పందించగా తాజాగా జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
1986 నుండే పౌల్ట్రీ రంగంలో అడుగు పెట్టి, అంచలంచలుగా ఎదిగి ఈరోజు అందరూ గౌరవించే స్థాయికి ఎదిగిన వ్యక్తి మంత్రి ఈటల రాజేందర్ అని పేర్కొన్నారు.ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి కింది స్థాయి నుండి ఎంతో కష్టపడి స్వతహాగా ఎదిగిన నాయకుడి మీద కక్ష కట్టి ఇలా దోషిగా చిత్రించడం తగదని తెలిపారు.
కాగా కష్టం వచ్చిందంటే నేనున్నా అంటూ ముందుండే వ్యక్తి ఈటల రాజేందర్ అని, అలాంటి మనిషిపై కబ్జాదారుడు అనే ముద్ర వేసి, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే కుట్రలు జరుగుతుంటే హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు ఎవరు కూడా సహించరని సమ్మిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.