దేశవ్యాప్తంగా పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు.ఈ మాట మనం చెప్పడమే కాదు, ప్రపంచ దేశాలు భారత్ లో కరోనా కేసులు పెరుగుదల విషయంలో చెబుతున్న మాట.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 40 కి పైగా దేశాలు భారత్ ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.వివిధ రూపాల్లో తగిన సహాయాన్ని ప్రకటించాయి.
రోజుకు నాలుగు లక్షలకు దగ్గరగా కొత్త కేసులు నమోదవుతున్న తీరు ప్రపంచ సమాజాన్ని ఆందోళనలో కి నేదుతోంది.మొదటి దశ కరోనా విజృంభించిన సమయం దేశ పరిస్థితి అదుపులోనే ఉంది .ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతా లాక్ డౌన్ విధించారు.అయితే అకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తడంతో పాటు , కేంద్రం పై విమర్శలు వచ్చాయి.
అయినా, లాక్ డౌన్ విధించిన కారణంగా, కేసులు అదుపు లోకి వచ్చాయి.అయితే రెండో దశ మాత్రం తీవ్రంగా ఉండడం, కేంద్రం ఈ విషయంలో పెద్దగా స్పందించకపోవడం, రాష్ట్రాలకే నిర్ణయాలు వదిలి వేయడం వంటి కారణాలతో దేశమంతా అల్లకల్లోలంగా మారుతోంది.
అయితే ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పుతున్న ట్లుగా కనిపించడం, కొన్ని రాష్ట్రాలు సరైన అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది .దీనిపై ఏదో ఒక నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న, సరిపడినంత స్థాయిలో అది అందుబాటులోకి రాకపోవడం ఇబ్బందికరంగానే మారింది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు కేంద్ర కేబినేట్ లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యం, కరోనా తీవ్రత బాగా ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో ఒక నెల రోజుల పాటు దేశమంతా లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు గా కనిపిస్తోంది.అయితే ప్రధాని మాత్రం తన నిర్ణయం ఏంటి అనేది బయటకి రాకుండా చూసుకుంటూ ఉండడంతో దేశమంతా ఈ రోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ మీదే ఉంది.