కరోనా విజృంభణతో వేసవిలో జరగాల్సిన పెళ్లిళ్లు మళ్లీ నిలిచిపోతున్నాయి.గత సంవత్సరం కొవిడ్ నిబంధనలు, లాక్డౌన్తో రెండు నెలలు ఆలస్యంగా పెళ్ళిళ్లు నిర్వహించారు.
ఈసారి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో మే, జూన్లో వివాహాలు చేసేందుకు చాలా కుటుంబాలు సిద్ధమయ్యాయి.వచ్చే రెండు నెలలు పూర్తిగా మంచి ముహూర్తాలు ఉండడంతో ఫంక్షన్హాళ్లు, బాజాభజంత్రీలు, ఫొటోగ్రాఫర్లు, క్యాటరింగ్, వంటవాళ్లు, పూలు డెకరేషన్కు అడ్వాన్స్లు ఇచ్చారు.
అయితే మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతుండటం వల్ల చాలా మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఓ వివాహ పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది.
ఎవరి పెళ్లి పత్రికలో అయినా శ్రీరస్తు.శుభమస్తు.అవిఘ్నమస్తు అంటూ రాయిస్తారు.కానీ ఈ కరోనా పెళ్లి పత్రికలో మాత్రం శానిటైజర్ ఫస్టు.! మాస్క్ మస్టు.! సోషల్ డిస్టెన్స్ బెస్ట్.! అంటూ కరోనా నిబంధనల గురించి తెలియజేశారు.లగ్గం మే నెల 1వ తారీఖు శనివారం పొద్దు పొడిచినంక 8 గంటలకు ఇన్ స్టా లైవ్ లో చూడగలరని తెలియజేశాడు.
వధూవరులకు కరోనా నెగిటివ్ అని కూడా పత్రికలో పేర్కొనడం గమనార్హం.పెండ్లిని ఆన్లైన్ లో చూసి ఆశీర్వదించాలని, విందు మాత్రం ఎవరింట్లో వారే తినాలని.బరాత్ కూడా ఉందని, కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగరాలని చెబుతూ ఈ కార్డ్ ను ఫన్నీగా రూపొందించారు.కట్నాలు సమర్పించేవాళ్లు ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా పంపించవచ్చంటూ క్యూఆర్ కోడ్ ను ముద్రించాడు.
ఈ పెళ్లిని మై విలేజ్ షో టీమ్ లైవ్ లో కవర్ చేస్తుందన్నారు.ఇలా అనిల్ తన వెడ్డింగ్ కార్డ్తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’అని పెళ్లి పత్రికపై రాసి ఉండటం విశేషం.ఈ పెళ్లి పత్రిక ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.