సాధారణంగా నాట్య మండలిలో, నాట్యం నేర్చుకునే చోట మనకు నటరాజు విగ్రహం దర్శనమిస్తుంది.నాట్యం పోటీలలో లేదా నాట్యం ప్రారంభించే ముందుగా నటరాజ విగ్రహాన్ని పూజిస్తారు.
ఈ విధంగా నాట్యం చేసే వారు ముందుగా నటరాజు ను పూజించడానికి గల కారణం ఏమిటంటే పరమేశ్వరుడు పరమానంద స్వరూపుడనీ, నాట్యం పరమానందానికి ఒక సూచిక అనీ, పరమానందాన్ని ప్రాణ కోటికి అందించడమే నాట్యంలో ఉన్న అర్థం అని చెబుతారు.
మనకు నటరాజ రూపంలో శివుడు విగ్రహాలు దర్శనమిస్తాయి.
ఈ నటరాజ విగ్రహాలకు మనదేశంలో చోళుల కాలంలోనే ఎంతో ప్రాచుర్యం లభించింది.ఈ క్రమంలోనే చోళులు నిర్మించిన ఆలయాలలో ఈ విధమైనటువంటి పరమేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్టించారు.
ఈ విధంగా చోళులు ప్రతిష్టించిన విగ్రహం లో పరమేశ్వరుడి కురులు గాలిలో ఎగురుతూ ఒక మరుగుజ్జు బొమ్మపై నిలబడి నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది.ఇంతకీ ఆ పరమేశ్వరుడి కాలు కింద ఉన్న మరుగుజ్జు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
శివుడు కురులు విరబోసుకుని మరుగుజ్జు పై నాట్యం చేస్తూ మనకు దర్శనమిస్తాడు.శివుడు నిలబడి ఉన్న ఈ మరుగుజ్జు అపస్మార పురుషుడు (అంటే మానవులలోని అజ్ఞానికి) చిహ్నం.శివుడు తన తాండవంతో అజ్ఞానాన్ని, అహంకారాన్ని అణచివేస్తాడు.శివుడి కుడి వైపున వెనుక ఉండే చేతిలో ఢమరుకం, ముందు ఉండే చేయి అభయ ముద్రను సూచిస్తాయి.శివుని చేతిలో ఉన్న డమరుకం క్రమబద్దమైన లయానిత్వ సృష్టిని తెలియజేస్తుంది.నటరాజు పాదాల కింద ఉండే పద్మం పునర్జన్మకు ప్రతీకగా చెబుతుంటారు.