ఇప్పుడంటే పర్లేదు కానీ.ఏడాది క్రితం అమెరికా గురించి వినాలంటే అన్ని దేశాల ప్రజలు వణికిపోయేవారు.
కరోనా వల్ల ఈ భూమ్మీద తీవ్రంగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యమే.ఇది సాధారణ జ్వరమేనంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ లైట్ తీసుకోవడంతో కరోనా తానేంటో, తన సత్తా ఏంటో చూపించింది.
ఫలితంగా లక్షలాది కేసులు, గుట్టలు గుట్టలుగా శవాలు, నిర్విరామంగా మండిన ఎలక్ట్రిక్ దహన వాటికలు.కరోనా వైరస్ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.
అందుకే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన లక్ష్యం కరోనాను రూపుమాపడమేనని ప్రకటించారు జో బైడెన్.అందుకు తగ్గట్లుగానే ప్రణాళిక బద్ధంగా కృషి చేసిన ఆయన లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు.
పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్న జో బైడెన్ జూలై నాలుగు నాటికి అమెరికాను కోవిడ్ ఫ్రీ కంట్రిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.తొలుత మొండికేసిన అమెరికన్లు ఆ తర్వాత తమ పంథాను మార్చుకుని టీకాలు తీసుకుంటున్నారు.
దీంతో అక్కడ కఠినంగా అమలైన నిబంధనల్లో కాస్త సడలింపులు వస్తున్నాయి.రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు ఇకపై మాస్క్లు లేకుండా తిరగవచ్చని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.
ఒక్క డోస్ వేయించుకున్న వారు కూడా మాస్క్లు పెట్టుకోనవసరం లేదని వెల్లడించింది.అయితే కొత్త వ్యక్తుల సమూహంలోకి, పెద్ద గుంపులోకి వెళ్లేటపుడు మాత్రం అందరూ మాస్క్లు పెట్టుకోవాల్సిందేనని సీడీసీ హెచ్చరించింది.
ఇదే సమయంలో కనీసం ఒక్క డోసు కూడా వేయించుకోని వారు మాత్రం మాస్క్ లేకుండా బయట తిరగకూడదని పేర్కొంది.
మరోవైపు దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలోనూ పరిస్ధితులు కుదటపడటంతో ఏడాది నుంచి అమల్లో ఉన్న ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాషింగ్టన్లో రోజువారీ వైరస్ వ్యాప్తి రేటు లక్షకు అత్యల్పంగా 14 కేసులుగా నమోదైంది.మే 1 నుంచి జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లను 50 శాతం సామర్థ్యంతో అనుమతిస్తామని అలాగే, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో లైవ్ మ్యూజిక్ను కూడా అనుమతించనున్నట్టు నగర మేయర్ తెలిపారు.
కాన్సెర్ట్ హాళ్లు, సినిమా థియేటర్ల సామర్థ్యాన్ని 25 శాతానికి పెంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.పబ్లిక్ పూల్స్ను 50 శాతం సామర్థ్యంతో తిరిగి తెరిచేందుకు అనుమతిస్తామన్నారు.
రెస్టారెంట్లలో ఇప్పటి వరకు అవుట్ డోర్ టేబుల్ వద్ద ఆరుగురికి మాత్రమే అనుమతి ఉండగా, ఇకపై 10 మందిని అనుమతించనున్నారు.ప్రార్థనా స్థలాలకు వచ్చే వారిని 40 శాతానికి పెంచుతున్నట్టు బౌజెర్ తెలిపారు.
దీంతో పర్యాటక రంగం, కన్వెన్షన్ ఇండస్ట్రీ గాడినపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ పూర్తిగా ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ హెచ్చరించారు.
.