దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజురోజుకి అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగులపై కూడా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం.అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నట్లు, దీంతో ప్రజలందరిలో కూడా ఆందోళన నెలకొనడంతో, కరోనా వైరస్ మరోసారి విజృంభించడంతో బ్యాంకు పని వేళలు తగ్గించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంకు పనివేళల్లో కీలక మార్పులు చేపట్టింది.
నేటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడంతో పాటు, ఈ రూల్స్ ని కూడా మే 15 వరకు అమల్లో ఉంటున్నట్లు బ్యాంకు ప్రతినిధులు తెలుపుతున్నారు.
అదికూడా కొంత మంది సిబ్బంది తోనే బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం, అలాగే మరికొంత మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు తెలియజేస్తున్నారు.కరోనా ఉధృతి తగ్గేంత వరకు బ్యాంకు పనివేళలను తగ్గించాలని బ్యాంకు ఉద్యోగుల కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇలా ఉండగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 600 మందికి పైగా ఎస్బిఐ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడినట్లు అందరికీ తెలిసిన విషయమే.దీనితో సగం మంది ఉద్యోగులతోనే విధులు నిర్వహిస్తున్నారని తెలంగాణ ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా పేర్కొన్నారు.