శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు జన్మించిన రోజును శ్రీరామ నవమిగా మనము జరుపుకుంటాము.శ్రీరామచంద్రుని కలియుగ దైవంగా తెలుగు ప్రజలందరూ భావిస్తారు.
శ్రీ రామ నామం ఆ రాముని కంటే ఎంతో గొప్పది.రామనామం సంకల్పిస్తే ఏ పని చేసిన విజయవంతమవుతుందని భావిస్తుంటారు.
తెలుగు కొత్త సంవత్సరంలో జరుపుకొనే ఉగాది పండుగ తరవాత వచ్చే శ్రీరామనవమి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ శ్రీరామ నవమి వేడుకలకు రెండు రాష్ట్రాలలో ఉన్న రాముని ఆలయాలు ఎంతో వైభవంగా అలంకరించి నవమి వేడుకలను జరుపుకుంటారు.
అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా భక్తులకు ప్రవేశం లేకుండా కేవలం స్వామివారికి జరగాల్సిన పూజా కార్యక్రమాలు జరుపుతారు.శ్రీ రామ నవమి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యంగా పానకం వడపప్పును సమర్పిస్తారు.
శ్రీరామనవమికి ఈ నైవేద్యం ఎంతో ప్రత్యేకం.నవమి రోజు ఈ నైవేద్యం ఎందుకంత ప్రత్యేకత అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.
శ్రీరామ నవమి వేడుకలు చైత్రమాసంలో జరగటం వల్ల వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి.కనుక శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం దేవుడికి నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా పెడతారు.
ఈ విధంగా పెసరపప్పు పానకం సేవించడం వల్ల ఆరోగ్యం,ఆయుష్యాభివృద్ధ కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.అదేవిధంగా వడపప్పు పానకం మన శరీరానికి చలువ చేస్తాయి కనుక ఈ పండుగ రోజు ప్రసాదంగా వీటికి అంత ప్రాధాన్యత ఉంది.
పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయి.అదేవిధంగా పానకం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం.సాక్షాత్తు విష్ణుమూర్తి రాముడు అవతారంలో ఉండటం వల్ల స్వామివారికి పానకం నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది
.