తెలుగుదేశం పార్టీ లో అల్టిమేట్ నిర్ణయం ఏదైనా అది చంద్రబాబు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.పార్టీలో నాయకులు చాలామందే ఉన్నా, ఎవరి వాయిస్ గట్టిగా వినిపించదు.
ఎవరు ఏం మాట్లాడాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఖచ్చితంగా అధినేత చంద్రబాబు అనుమతి ఉండాల్సిందే.ఇది తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ.
ఇక పార్టీలో చంద్రబాబు ఆశీస్సులు ఉన్నంతకాలం కొంతమంది నాయకులకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది.కానీ వారి వాయిస్ మరి రేజ్ అవుతూ, తమను డామినేట్ చేస్తున్నారనే అభిప్రాయం కలిగితే, వెంటనే వారికి ప్రాధాన్యం తగ్గిపోతుంది.
ఆ ప్లేసును మరొకరితో భర్తీ చేస్తుంటారు.ఎవరు ఎంత సమర్థులైన నాయకులు అయినా, చంద్రబాబు లోకేష్ లను డామినేట్ చేయకుండా ఉన్నంత వరకు మాత్రమే.
ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న విషయానికి వస్తే, ఆయన గురించి అందరికీ తెలిసిందే.
అవతిలి వ్యక్తి ఎవరైనా తమకు రాజకీయ విరోధి అయితే చాలు వారిపై మాటల తూటాలతో విరుచుకుపడుతూ, టిడిపి తరఫున బలమైన వాయిస్ వినిపిస్తూ ఉంటారు.
ఒక దశలో అధినేత ఆదేశాలను సైతం పట్టించుకోకుండా, తెలుగుదేశం పార్టీలో తన ప్రభావం పెంచుకుంటూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉంటారు.మొదటి నుంచి అచ్చెన్న ఇదే వైఖరితో ఉంటూ ఉండడంతో, వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ హవా ను అడ్డుకునేందుకు అచ్చెన్న సమర్ధుడని చంద్రబాబు బాగా నమ్మారు.
అందుకే ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.కానీ ఆ బాధ్యతలు అప్పగించడం పై లోకేష్ తీవ్ర అభ్యంతరం తెలిపారని, అచ్చెన్న తన దూకుడు తో డామినేట్ చేస్తారని, పార్టీలో తన ప్రభావం ఏమీ ఉండదని, మొదటి నుంచి లోకేష్ భయపడుతూనే వస్తున్నారు.
సరిగ్గా అదే జరిగింది.ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఓ ప్రైవేటు సంభాషణల్లో లోకేష్ శక్తి సామర్థ్యాలపై అచ్చెన్న మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.లోకేష్ అసమర్థుడు అన్నట్లుగా మాట్లాడిన తీరు పై లోకేష్ తీవ్రంగా నొచ్చుకున్నారట.పైకి ఇదంతా వైసీపీ కుట్ర అని, సాక్షి మీడియా కట్టుకథ కానీ నమ్మించే ప్రయత్నం చేసినా, స్వయంగా అచ్చెన్న మాట్లాడిన మాటలు జనాల్లోకి వెళ్ళిపోయాయి.
అయితే ఈ వీడియో పై విచారణ చేయించమని ఎక్కడా ఆయన కోరకపోవడం వంటి కారణాలతో, అచ్చెన్న తనపై చేసిన వ్యాఖ్యలు నిజమేనని లోకేష్ నమ్ముతున్నారు.
ఎప్పటికైనా అచ్చెన్న తో ఇబ్బందే అని, అందుకే తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న అని, అచ్చెన్న కు కాకుండా తాను సూచించిన బీద రవిచంద్ర యాదవ్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని లోకేష్ బాబు వద్ద ప్రస్తావించారట.ఇప్పటికైనా అచ్చెన్న ను తప్పించి, మరొకరికి ఆ పదవి ఇవ్వాలని, అవసరమైతే అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువ ఎంపీ, అచ్చెన్న కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడు కి ఆ పదవి ఇచ్చినా, తనకు అభ్యంతరం లేదని, ఇప్పుడు లోకేష్ చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.దీనిపై అతి త్వరలోనే చంద్రబాబు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే అచ్చెన్నను తొలగించకుండా, ఆయనతోనే రాజీనామా చేయించాలని బాబు ప్లాన్ చేస్తున్నారట.