ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోంది.పవన్ కు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తూ బిజెపి నాయకులు పదేపదే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అంతేకాదు ఏపీలో తమ ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.కాని తెలంగాణ విషయానికొస్తే అసలు జనసేనతో తమకు సంబంధం లేదని అక్కడి నాయకులు స్టేట్మెంట్లు ఉంటున్నాయి.
అసలు తాము జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోలేదని , ఆ అవసరం లేదంటూ కొంతకాలం క్రితం తెలంగాణ బిజెపి నాయకులు వ్యాఖ్యానించారు.ఆ ఆగ్రహంతోనే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి కాకుండా, టిఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జనసేన మద్దతు పలికింది.
ఈ వ్యవహారంతో తెలంగాణలో జనసేన బీజేపీ మధ్య దూరం పెరిగింది అనుకుంటున్న సమయంలో, అకస్మాత్తుగా మరోసారి ఈ రెండు పార్టీలు తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాయి.ఖమ్మం ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ ఈ పొత్తు పై చర్చలు జరిపారు.అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట.
అసలు తన ప్రమేయం లేకుండానే ఈ పొత్తులు ఖరారు కావడంపై ఆయన అసహనం తో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంతో తెలంగాణ బిజెపి లో ఆధిపత్య పోరు , గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది .తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి బండి సంజయ్ దూకుడుగా వెళుతున్నారు.ఆయనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.
అయితే తమను పెద్దగా పట్టించుకోవడం లేదనే బాధ పార్టీ సీనియర్ నాయకుల లోనూ ఉంది.అందుకే జనసేన పొత్తు పెట్టుకునే విషయంలో బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రంగంలోకి దిగి ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చినట్టు తెలుస్తుంది.
దీనిపైనే సంజయ్ ఆగ్రహంగా ఉన్నారట.జనసేన పార్టీతో పొత్తు అవసరం లేదు అన్నట్లుగా బండి సంజయ్ అభిప్రాయపడుతున్నట్లు గా సమాచారం.
ఈ ఇద్దరు సీనియర్ నేతలు పార్టీ శ్రేయస్సు దృష్ట్యా జనసేన ను దగ్గర చేసుకున్నారని, జనసేన ను దూరం చేసుకోవడం వల్ల పార్టీ ఇబ్బందులు పడడం తప్ప కలిసి వచ్చేది ఏమీ లేదనే ఆలోచనతోనే ఈ విధంగా చేశారట.అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తాను ఉండగా , తనకు తగిన సమాచారం లేకుండానే ఈ పొత్తులు ఖరారు కావడంపై సంజయ్ మాత్రం చాలా ఆగ్రహంతో రగిలిపోతున్నారట.