తిరుపతి ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరదీశారని నగరి ఎమ్మెల్యే ఆర్.కే రోజా చెప్పుకొచ్చారు.
ఒక్క రూపాయి కూడా పంచకుండా.ఎవరికీ మద్యం పంపిణీ చేయకుండా.
ప్రలోభాలు లేని ఎన్నికలు నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి జగనే అని ఆమె ప్రశంసించారు.కేవలం మెరుగైన పాలన, సంక్షేమ పథకాల ద్వారానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులను జగన్ మోహన్ రెడ్డి గెలిచారని ఆమె ప్రశంసల జల్లు కురిపించారు.
ఇటీవల రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న తర్వాత ఇంటికే పరిమితమై బెడ్ రెస్టు తీసుకుంటున్న రోజా ఆదివారం నాడు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసి.ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు.
టీడీపీ పార్టీ నేతలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారని వైసీపీపై టీడీపీ నాయకులతో పాటు 1-2 న్యూస్ ఛానల్స్ లో కూడా నిరంతరాయంగా ఆరోపణలు వస్తున్నాయి.
అయితే వీటిపై స్పందించిన రోజా టీడీపీ పార్టీకి ఓటమి ఖాయమైందని, జగన్ పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని వ్యాఖ్యానించారు.టీడీపీ పార్టీ నాయకులు ముందుగానే ఓటమికి కారణాలు వెతుక్కుని దొంగ ఓట్ల డ్రామా ఆడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
ఇలాంటి తప్పుడు ప్రచారం వలన తమ పార్టీ ప్రతిష్టకు వచ్చిన నష్టం ఏమీ లేదని ఆమె అన్నారు.
కేవలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కక్షతోనే దొంగ ఓట్ల డ్రామాకు టీడీపీ పూనుకుందని ఆమె మండిపడ్డారు. దొంగ ఓటర్లు ఓట్లు వేస్తుంటే పోలింగ్ బూత్ లలో ఎందుకు పట్టుకోలేకపోయారు అని ఆమె సూటిగా ప్రశ్నించారు.మంత్రి పెద్దిరెడ్డి ని వీరప్పన్ అని లోకేష్ విమర్శించిన విషయం తెలిసిందే.
అయితే అందుకుగాను లోకేష్ భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని రోజా హెచ్చరించారు.తిరుపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.