అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు బైడెన్.
అలాగే ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ అమెరికన్లను ఆదుకునేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజ్ను సైతం ప్రకటించి.దాని ఫలాలు అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన దృష్టి ఆర్ధిక వ్యవస్థపై పడింది.కరోనా దెబ్బతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉంది.
అనేక చిన్నా చితక వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.బోయిం గ్ వంటి విమాన తయారీ దిగ్గజ కంపెనీలూ వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి.
ఆర్థిక వ్యవస్థ ఎపుడు గాడిలో పడుతుందో కూడా కంపెనీలకు తెలియడం లేదు.ఇదే సమయంలో ప్రభుత్వానికి సైతం ఆదాయం బాగా తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్ ట్యాక్స్ను బైడెన్ యంత్రాంగం 21 శాతం నుంచి 28 శాతానికి పెంచింది.
బైడైన్ అనుసరించే పన్నుల విధానం భారత్కు ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టే నాటికి అమెరికాలోని కంపెనీలపై 35 శాతం కార్పొరేట్ పన్ను ఉండేది.దీంతో ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక అమెరికా కంపెనీలు చైనా, భారత్, దక్షిణ కొరియా తదితర దేశాలకు తరలిపోయాయి.
స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్ కంపెనీలను తిరిగి ఆకర్షించేందుకు కార్పొరేట్ టాక్స్ను 21 శాతానికి కుదించారు.అయితే తాము అధికారంలోకి వస్తే దీనిని 28 శాతానికి పెంచుతామని బైడెన్ తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించి.
చెప్పినట్లే చేశారు.ఈ ప్రకటన ఇప్పుడు అమెరికా కంపెనీలతో పాటు భారత ప్రభుత్వానికి సైతం గుబులు రేపుతోంది.
విదేశాల్లో లాభాలు గడించిన సంస్థలు 28 శాతం పన్ను చెల్లించకపోతే, దేశీయంగా అదనంగా డొమెస్టిక్ టాక్స్ వసూలు చేసేందుకు బైడెన్ సర్కార్ సిద్ధమవుతోంది.ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే, తయారీ రంగంలోకి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రూపొందించిన భారత నూతన పన్నుల విధానంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణుల అంచనా.
భారత్లో కొత్తగా ప్లాంట్ను స్థాపించిన విదేశీ సంస్థకు 15 శాతం పన్ను రాయితీ కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం.దీనికి తోడు అదనపు లెవీలు కూడా దక్కుతాయి.ఇది అమెరికన్ కంపెనీలను ఊరిస్తున్నా.బైడెన్ విధానంతో ఇబ్బందులు తలెత్తనున్నాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత్లో పన్ను రాయితీ పొందాలా.అమెరికాలో 28 శాతం పన్ను చెల్లించాలా? అన్న విషయంపై అమెరికా సంస్థలు ఏటూ తేల్చుకోలేకపోతున్నాయి.
అలాగే అమెరికాలోని పలు కంపెనీలకు భారత ఐటీ కంపెనీలు ఆఫ్షోర్ పద్దతిలో పలు సేవలు అందిస్తున్నాయి.ఇందుకు ఈ కంపెనీలకు చెల్లించే ఫీజుపై అమెరికా ప్రస్తుతం గ్లోబల్ ఇంటాంజిబుల్ లో టాక్స్ ఇన్కమ్ (గిల్డీ) పేరుతో 20 నుంచి 21 శాతం పన్ను వసూలు చేస్తోంది.తాము అధికారంలోకి వస్తే దీనిని 40 శాతానికి పెంచుతామని బైడెన్ ప్రకటించారు.ఈ ప్రతిపాదన మాత్రం ఐటీ రంగానికి చెందిన భారత బీపీఓ కంపెనీలను భయపెడుతోంది.దీనిపై బైడెన్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వుంది.