అగ్ర రాజ్యం అమెరికాలో మన తెలుగువారి హవా కొనసాగుతూనే ఉంది.తాజాగా ఏపీ లోని చిత్తూరు జిల్లాకు చెందిన మన తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది.
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలోని డైల్ హై నగరానికి మేయర్ గా తెలుగు వ్యక్తి ప్రముఖ ఎన్నారై సముద్రాల సుధీర్ ఎంపిక అయ్యారు.ఆయన ఎంపిక పట్ల చిత్తూరు జిల్లాలోని అయన గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఎవరీ సముద్రాల బాబు రావు.
ఏపీ నుంచీ అమెరికా వెళ్లి ఎంతో మంది ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు.
అమెరికాలో అనేక రంగాలలో మన తెలుగు వారి ముద్ర తప్పకుండా ఉంటుంది.కీలక విభాగాలలో మాత్రమే కాదు, ప్రభుత్వ శాఖలలో, రాజకీయ , విద్యా, వైద్య రంగాలలో మన వారికి తిరుగులేదనే చెప్పాలి.
బిడెన్ అధ్యక్షుడు అయిన తరువాత భారతీయులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో సముద్రాల సుధీర్ మేయర్ గా ఎన్నిక అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చిత్తూరు జిల్లా బుచ్చి నాయుడు కండ్రికకు చెందిన సముద్రాల బాబు రావు తనయుడు సముద్రా సుధీర్ ఎన్నో ఏళ్ళుగా అమెరికాలోని స్థిరపడ్డారు.
అక్కడ సేవా కార్యక్రమాలలో తనవంతు సాయం చేస్తూ అందరికి సుపరిచయం అయిన సుధీర్ రాజకీయాల వైపు దృష్టి సారించారు.ఫలితంగా తాజాగా డైల్ హై కి మేయర్ గా ఎన్నిక అవడంతో ఆ ప్రాంతంలో మేయర్ గా ఎన్నికైన ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.
సుధీర్ తన ప్రమాణ స్వీకారాన్ని భగవద్గీత పై ప్రమాణ చేసి చెప్పడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.సుధీర్ కు భారతదేశ సంసృతీ సాంప్రదాయాలపై ఉన్న గౌరవాన్ని ఈ విధంగా చాటుకున్నారని తెలుగు ఎన్నారైలు, ఆయన సొంత ఊరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.