జనసేన పార్టీ రాజకీయపరంగా ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్న ట్టుగా కనిపిస్తోంది.గతంలో పార్టీ ఉనికి కోసం ఆరాటపడుతున్నట్టు ఉండేది.
కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి పవన్ రాజకీయాలు మరింత చురుగ్గా చేస్తున్నారు.ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి స్థాయిలో జనసేన ప్రభావం చూపించింది.
అక్కడక్కడ కొన్ని సీట్లను గెలుచుకుని గతం కంటే ఇప్పుడు జనసేన పరిస్థితి ఫర్వాలేదు అన్నట్లుగా ఉంది.ఇప్పుడు తిరుపతిలోనూ పవన్ పార్టీ హడావుడి అలాగే కనిపిస్తోంది .బీజేపీ నేతలు పవన్ ను పదే పదే పొగుడుతూ, బిజెపి జనసేన కూటమి తరపున పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని , ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని బీజేపీ పెద్దలు తమకు చెప్పారని, జనసేన తో రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
జనసేన ఈ ఆనందంలో వుండగానే , పార్టీకి చెందిన కీలక నాయకులు బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశం అవుతోంది.అది కూడా జనసేన పై వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం తో నిజంగానే జనసేన లో ఈ పరిస్థితి ఉందా అనే అభిప్రాయం ప్రజలలోనూ కలుగుతోంది.2019 ఎన్నికలలో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణ సైతం ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి, అనేక విమర్శలు చేశారు.ఇప్పుడు అదే రీతిలో జనసేన నాయకుడు మాదాసు గంగాధరం సైతం పార్టీకి రాజీనామా చేసి అంతే స్థాయిలో విమర్శలు చేశారు.
అసలు జనసేన పార్టీ లో ఏం జరుగుతుందో పవన్ కు తప్ప ఎవరికీ ఏమీ తెలియడం లేదని , సీనియర్ రాజకీయ నాయకుల సలహాలు పట్టించుకోవడంలేదని, కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని, ఇలా అనేక అంశాలపై మాదాసు గంగాధరం విమర్శలు చేశారు.దీంతో అసలు జనసేన రాజకీయ పరిస్థితిపై అందరికీ అనేక అనుమానాలు కలుగుతున్నాయి.బిజెపి తో జనసేన పార్టీకి పొత్తు ఉన్నా, ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు పై బీజేపీని ప్రస్నించకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం కానీ, ఇతర అంశాలలో కానీ పవన్ వ్యవహరిస్తున్న తీరు పైన అనేక విమర్శలు వస్తున్నాయి.
ఇక సొంత పార్టీలో నాయకులు రాజీనామా చేసి మరీ ఈ స్థాయిలో విమర్శలు చేయడం తో, పవన్ నిజంగానే రాజకీయంగా తప్పు చేస్తున్నారా అనే సందేహాలు ఎన్నో తలెత్తుతున్నాయి.