ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం తిరుపతి కేంద్రంగా సాగుతున్నాయి.అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తిరుపతి ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి.
కుల మత అంశాలను ప్రస్తావిస్తూ, అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారు.ఇక ఇక్కడి నుంచి లోక్ సభకు పోటీ పడుతున్న టిడిపి, కాంగ్రెస్, బీజేపీ -జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ ఎన్నికలు టెన్షన్ పుట్టిస్తున్నాయి.
ప్రధాన పోటీ అంతా బిజెపి,టిడిపి, వైసీపీ మధ్య నెలకొనడంతో, ఫలితం ఎలా ఉంటుందనేది ఆందోళన కలిగిస్తోంది.వైసిపి ఇక్కడ విజయం పై పూర్తి ధీమాతో ఉంది.
మెజారిటీ పైనే లెక్కలు వేసుకుంటోంది.గతంలో తిరుపతి లో సభ నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీ కంటే, ఎక్కువ మెజారిటీని సాధించాలనే పట్టుదలతో ఉండగా , బిజెపి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.
బిజెపి- జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ ను గెలిపించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా వస్తాయని, టిడిపి , బిజెపి జనసేన వంటి పార్టీలు ఆశించినా, ఎవరూ ఊహించని విధంగా వైసీపీకి ఈ ఎన్నికలలో అత్యధిక స్థానాలు దక్కాయి.ప్రజలు వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారని, వారంతా తమకు ఓటు వేస్తారని ఊహించిన టిడిపి, బిజెపి ,జనసేన పార్టీ లకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి.
ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది అనే భయం కలుగుతోంది.ఇదిలా ఉంటే , ఇప్పుడు తిరుపతి లోక్ సభ కు పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా పార్టీలకు ఖర్చు మాత్రం భారీగానే ఉందట.సభలు-సమావేశాలు కు భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద పెద్ద నాయకులు తిరుపతిలో పర్యటించేందుకు వస్తుండడం, వారికి అన్ని ఏర్పాట్లు చేయడం వంటి కారణాలతో ఖర్చు తడిసి మోపెడు అవుతుండడం కూడా టెన్షన్ కలిగిస్తోందట.
.