నిన్న తెలంగాణలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలు ప్రజలను ఇబ్బందిపెట్టాయి.ముఖ్యంగా రైతులు మాత్రం తెగ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇలా అకాల వర్షం, పిడుగులు రైతులను తీవ్ర ఇక్కట్లకు గురిచేశాయి.అదీగాక కల్లాలు, మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఇక నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని 130 ప్రాంతాల్లో వానలు పడగా, జనగామ జిల్లాలోని లింగాల ఘనపురంలో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఈ వర్షంవల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.యాదాద్రి జిల్లా లింగోజీగూడలో పిడుగు పడి రైతు దంపతులు ప్రాణాలు కోల్పోయారు.వారు పెంచుకుంటున్న గేదె కూడా ఈ ఘటనలో మృత్యువాత పడింది.
ఇదే జిల్లాలోని బొమ్మల రామారం మండలం మర్యాలలోని మన్నె రాములు పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడడంతో ప్రాణాలు కోల్పోయాడు.
ఇక సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన రైతు సంబంగ రామయ్య, రాయపోల్ మండలం మంతూరుకు చెందిన యువ రైతు పట్నం నర్సింలు, మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో ఓ ఇటుక బట్టీలో పనిచేస్తున్న మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఈశ్వర్ మొదలగు వీరంతా కూడా పిడుగుపాటుకు గురై మృతి చెందారు.
ఇకపోతే తెలంగాణలో నేడు, రేపు కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.