ఒక్కో గ్రామంలో ఒక్కో వింత ఆచారాలన్నీ పాటిస్తూ ఉంటారు గ్రామస్తులు.వారి ఆచారాల ప్రకారం వాటిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వారి మొక్కులను తీర్చుకుంటారు.
అలాగే ఒక గ్రామానికి చెందిన గ్రామస్తులు వారి గ్రామానికి పట్టిన అరిష్టం పోవాలని, వారి కష్టాలు తీరాలని పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి పడుకొని మరి దున్నపోతుతో తొక్కించుకుంటారు.ఆ వింత ఆచారం ఎక్కడ అని అనుకుంటున్నారా.?! అదేనండి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్ ప్రతి సంవత్సరం నిర్వహించే పోలేరమ్మ తీర్థంలో అనాది కాలం నుంచి ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా ఉదయం నుంచి ఉపవాసం ఉన్న గ్రామస్తులు, భక్తులు అందరూ కూడా మొదట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం దున్నపోతు పూజలు ఆచరించిన అనంతరం , గ్రామంలో ఊరేగించిన తర్వాత ఆలయం వద్దకు వెళతారు.ఉపవాసం ఉన్న గ్రామస్తులు అందరూ కూడా పసుపు నీళ్లతో స్నానమాచరించి అనంతరం అమ్మవారి ఆలయం ఎదుట బారులుతీరి పడుకొని ఉంటారు.
అనంతరం వెంటనే ఒక భక్తురాలు దున్నపోతును తీసుకొని పడుకున్న వారి మీద మూడు సార్లు దున్నపోతుతో నడిపిస్తారు.ఇలా చేయడం వల్ల గ్రామానికి ఉన్న అరిష్టం మొత్తం తొలగిపోతుందని, అలాగే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని అక్కడి వారి నమ్మకం.
అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ ఆచారాన్ని వారు పాటిస్తారని ఆ గ్రామస్తులు తెలియజేస్తున్నారు.గతంలో ఆ దున్నపోతును బలి ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ఉత్సవాలు నిర్వహించిన అనంతరం దానిని విడిచి పెడుతున్నట్లు అక్కడి గ్రామస్తులు పేర్కొన్నారు.