జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు.తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాను క్వారంటైన్ లో కి వెళుతున్నట్లు పవన్ ప్రకటించారు.
అయితే పవన్ ఈ విధంగా చేయడం వెనుక కారణాలు ఉన్నాయని, బీజేపీ పై ఉన్న ఆగ్రహంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.వాస్తవం గా చూసుకుంటే, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిని మాత్రమే క్వారంటైన్ లోకి పంపుతున్నారు.
వారి కాంటాక్ట్స్ ను మాత్రం కేవలం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు తప్ప, ఎక్కడా క్వారంటైన్ లో పెట్టడం లేదు.అయితే పవన్ మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక చాలా పెద్ద కథే ఉండదట.
ముఖ్యంగా పవన్ సినిమా వకీల్ సాబ్ విషయంలో బీజేపీ తీరుపై పవన్ అలిగినట్లు సమాచారం.
ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమా విషయంలో వ్యవహరించిన తీరు పై కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.
ఆర్థికంగా నష్టం చేకూర్చాలని ఉద్దేశంతో వకీల్ సాబ్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన, కనీసం బీజేపీ ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోగా , తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం పై పవన్ మండిపడుతున్నారు.అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జగన్ కు ఈ విషయంపై తగిన సూచనలు చేసి ఉంటే , ఈ పరిస్థితి వచ్చేది కాదు అని, అయినా బిజెపి ఈ వ్యవహారంలో ఏం పట్టనట్లుగా ఉండటంతోనే పవన్ తిరుపతి పర్యటనకు దూరంగా ఉండే నిమిత్తం క్వారంటైన్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు అనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.
కీలకమైన తిరుపతి ఉప ఎన్నికల సమయంలో పవన్ ఈ విధంగా వ్యవహరించడం పై బీజేపీ ఆందోళనగా ఉంది.
సునీల్ ధియోధర్, సోము వీర్రాజు, వంటి వారు తప్ప, బీజేపీ అగ్రనేతలు ఎవరు ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం తో, పవన్ సహకారంతో గట్టెక్కాలని భావించిన బీజేపీకి ఇప్పుడు పవన్ ఇచ్చిన షాక్ తో అనేక ఇబ్బందులు ఎదుర్కో వలసిన పరిస్థితి ఏర్పడింది.చాలా కాలం నుంచి బీజేపీ జనసేన మధ్య దూరం పెరిగినట్లు గా కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ సైతం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సి రావడం బిజెపికి మరిన్ని ఇబ్బందులు కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు.
వాస్తవంగా చూసుకుంటే, బీజేపీకి తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదు.
కేవలం పవన్ చరిష్మా ఆధారంగానే ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తోంది.అది కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో తమ పట్టు సాధించడం ద్వారా, ఏపీలో బలమైన పునాదులు వేసుకోవచ్చని చూసిన బీజేపీకి ఈ పరిణామాలు ఏవీ మింగుడు పడని అంశంగా మారాయి.