కరోనా వల్ల పర్యాటక రంగం కూడా కుదేలైన సంగతి తెలిసిందే.అదీగాక దాదాపు 18 నెలల క్రిందట పాపికొండల విహార యాత్రలో విషాదం చోటు చేసుకోగా అప్పటి నుండి ఈ పర్యటనను నిలిపి వేశారు.
కాగా ప్రకృతి ప్రేమికులకు పర్యాటకశాఖ శుభవార్త చెబుతుంది.ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని పర్యాటకులకు ఇది శుభవార్తే.
ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత పాపికొండల పర్యటనను నిలిపివేసిన అధికారులు తాజాగా, ఏపీ పర్యాటకశాఖ బోటుకు జల వనరుల శాఖ నుండి అనుమతులు తెచ్చుకున్నారు.ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి నుండి బోటు బయలుదేరుతుందని ఉభయగోదావరి జిల్లాల ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ టీఎస్ వీరనారాయణ తెలిపారు.
అంతే కాకుండా పాపికొండల పర్యాటకుల సౌకర్యార్థం త్వరలోనే ఆన్లైన్లో టికెట్లను కూడా ఉంచుతామని వెల్లడించారు.ఇక బ్రతుకు పోరాటంలో అలసిపోయిన మనసులు గోదావరిలో విహరిస్తూ పాపికొండల అందాన్ని వీక్షించే అవకాశం ఉపయోగించుకుంటారని తెలుస్తుంది.