తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పై అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి.బిజెపి, కాంగ్రెస్ టిఆర్ఎస్ వంటి మూడు పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నా, ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
టిఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి సీనియర్ రాజకీయ నాయకులు జానారెడ్డి పోటీ చేస్తున్నారు.ఇక్కడ గెలిచేందుకు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
మొదటి నుంచి తనకు గట్టి పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో సత్తా చాటాలని జానారెడ్డి భావిస్తుండగా, టిఆర్ఎస్ ఈ సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.అందుకే తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, జనాల్లోకి వెళ్తున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే , యువ నాయకుడు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సాగర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది.
కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.దుబ్బాక నియోజకవర్గంతో పాటు, ఇటీవల జరిగిన జీహెచఎంసీ ఎన్నికల ఫలితాలు చూసుకున్నా, కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.
కానీ బిజెపి బాగా బలపడింది అనే విషయం అందరికీ అర్థమైంది.ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆ పరిస్థితి రాకుండా, ఉండాలంటే కాంగ్రెస్ నాయకులంతా సమిష్టిగా ఈ ఉప ఎన్నికల్లో జానారెడ్డి విజయానికి కృషి చేస్తారని అంత అభిప్రాయపడుతుండగా , ఈ సమయంలోనూ కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలు బయటపడుతున్నాయి.
ఈ సాగర్ ఉప ఎన్నికలలో రేవంత్ రెడ్డి అవసరం తమకు ఏమీ లేదు అన్నట్లుగా సీనియర్ నాయకులు భావిస్తున్నారు.అయితే రేవంత్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించి సభలు సమావేశాలు నిర్వహిస్తే ఫలితం ఉంటుందని, టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆయన విరుచుకుపడే విధానం ఖచ్చితంగా కాంగ్రెస్ కు మేలు చేస్తుందని, యూత్ ను ఎక్కువగా ఆకట్టుకునేందుకు ఇదే సరైన మార్గం అని, కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు.కానీ యూత్ లో బలం ఉన్న రేవంత్ ను పట్టించుకోకుండా దూరం పెట్టాలని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లుగా సాగర్ ఎన్నికల ప్రచారం చూస్తే అర్థం అవుతోంది.ఏదో మొహమాటంగా అంటి ముట్టనట్టు రేవంత్ తో కాంగ్రెస్ సీనియర్లు ఉంటున్నారు తప్పితే , పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేద్దాం అన్న అభిప్రాయం లేకపోవడంతోనే ఈ విధమైన పరిస్థితి కాంగ్రెస్ కు వచ్చి పడింది అనే విషయం అర్థం అవుతోంది.