ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో భారతీయ మూలాలున్న క్రికెటర్లు వున్నారు.ఇది ఇప్పుడే కొత్తగా వస్తున్నది కాదు.
దశాబ్ధాల క్రితం నుంచే ఈ ట్రెండ్ కొనసాగుతుతోంది.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లి స్థిరపడిన భారతీయ కుటుంబాలు ప్రస్తుతం ఆయా దేశాల్లోని అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయి.
తాజాగా న్యూజిలాండ్ జట్టులో భారత సంతతికి చెందిన కుర్రాడు స్థానం సంపాదించాడు.కర్ణాటకకు చెందిన రవి కృష్ణమూర్తి కొన్నేళ్ల కిందట వ్యాపారం నిమిత్తం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
ఆయన కుమారుడు 21 ఏళ్ల రచిన్ రవీంద్ర తన ప్రతిభతో కివీస్ జట్టులో ప్లేస్ కొట్టేశాడు.
ఇతనికి రాయలసీమ జిల్లా అయిన అనంతపురంతో విడదీయరాని అనుబంధం వుంది.2016లో అనంతపూర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే స్పోర్ట్స్ అకాడమీకి తొలిసారి వచ్చాడు రవీంద్ర.ఇక్కడ శిక్షణ నచ్చడం, మెరుగైన మౌలిక వసతుల కారణంగా ఏటా సుమారు 3 నెలల పాటు ఈ కుర్రాడు న్యూజిలాండ్కు చెందిన హట్హక్స్, వెల్లింగ్టన్ జట్ల తరపున వచ్చి ఆర్డీటీ స్టేడియంలో సాధన చేసేవాడు.
క్రికెట్పై ప్రేమతో కేవలం శిక్షణ కోసమే అమ్మానాన్నలను వదిలి వేల కిలోమీటర్ల దూరంలోని అనంతపురం వచ్చేవాడు.లెఫ్టార్మ్ ఆఫ్స్పిన్ ఆల్రౌండర్గా మంచి ప్రతిభ చూపిన రవీంద్ర….తొలుత బ్యాట్స్మన్.అయితే బ్యాట్, బాల్తో నిలకడగా మంచి ప్రదర్శన చేసి అనతి కాలంలోనే న్యూజిలాండ్ అండర్-19, ‘ఎ’ జట్ల తరపున ప్రాతినిథ్యం వహించి సత్తా చాటాడు.
అతనిపై సెలక్టర్ల దృష్టిపడటంతో ఇంగ్లాండ్తో త్వరలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్తో తలపడే మ్యాచ్కూ ఎంపిక చేసిన 20 మంది ఆటగాళ్లలో ఒకడిగా రవీంద్ర స్థానం సంపాదించాడు.ఇతను తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.రవీంద్ర ఈస్థాయికి రావడం పట్ల అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో అతనికి కోచింగ్ ఇచ్చిన షాబుద్దీన్ , తల్లిదండ్రులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మారిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్తో భారత్ తలపడే మ్యాచ్ వేదిక లార్డ్స్ నుంచి సౌతాంప్టన్లోని ఏజిల్ బౌల్ స్టేడియంకు మారింది.ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 మధ్య భారత్ – న్యూజిలాండ్ జట్లు ఈ గ్రౌండ్లో తలపడనున్నాయి.
మొదట ఈ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో నిర్వహించాలని భావించారు.అయితే, సౌతాంప్టన్ స్టేడియంలో ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఉన్నాయని, ఆటగాళ్ల బయో బబుల్ కోసం అనువైనదిగా గుర్తించారు.
దీనితో పాటు ఐసీసీ, ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుకు కూడా లాభదాయకంగా ఉండడంతో సౌతాంప్టన్ స్టేడియంకు ఆమోదముద్ర వేశారు.