చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ చూస్తుండగానే ప్రపంచాన్ని చుట్టేసింది.మనిషిని ఎటు కదలనీయకుండా నాలుగు గోడల మధ్య బందీని చేయడంతో పాటు ఎంతోమంది ఆత్మీయులను దూరం చేసింది.
సెల్ఫ్ రెస్పెక్ట్గా భావించే ఉద్యోగాల్లోంచి పీకేసి రోడ్డు మీదకు తోసింది.తోటి మనిషి తుమ్మినా, దిగ్గినా ఓ అంటరానివాడిలా చూసింది ఈ సమాజం.
కరోనా కోరల నుంచి మానవాళి బతికి బట్టకట్టిందంటే అది వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల చలవే.తొలి నాళ్లలో మందే లేని ఈ మహమ్మారితో డాక్టర్లు ఎదురొడ్డి పోరాడారు.
తమకు తెలిసిన వైద్యంతో కొన్ని ప్రాణాలైనా కాపాడారు.ఈ క్రమంలో ఎంతో మంది వైద్యులు, సిబ్బంది ఆ వైరస్కు బలవ్వగా.
ఇప్పటికీ చనిపోతూనే వున్నారు.ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఇళ్లకు కూడా వెళ్లకుండా కుటుంబాన్ని సైతం పక్కనబెట్టి.
ఆసుపత్రిలో 24 గంటలూ అందుబాటులో వున్నారు ఎందరో వైద్యులు.వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు.
వీరి కృషిని గౌరవించి ఆయా దేశాలు అవార్డులు, రివార్డులతో సత్కరించాయి కూడా.
ఇదే బాటలో యూకే ప్రభుత్వం డాక్టర్లకు చేతనైనంతలో చిరు కానుక అందించే ప్రయత్నం చేసింది.
కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు గాను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న విదేశీ వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ఏడాది పాటు వీసా గడువును ఉచితంగా పొడిగిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.ఈ ఏడాది అక్టోబర్ 1తో వీసా గడువు ముగిసే వైద్యులు, హెల్త్కేర్ సిబ్బంది సహా వారిపై ఆధారపడిన జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులకు కూడా ఈ పొడిగింపు వర్తిస్తుందని యూకే ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది.
ఈ నిర్ణయం వల్ల దాదాపుగా 14 వేల మంది లబ్ది పొందుతారని వెల్లడించింది.ప్రభుత్వ నిర్ణయంపై బ్రిటన్లోని విదేశీ వైద్య నిపుణులు ముఖ్యంగా భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన యూకే హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ మాట్లాడుతూ.వైరస్పై బ్రిటన్ చేస్తున్న పోరాటానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది అంకితభావం, నైపుణ్యం నిజంగా అసాధారణమైనదని ప్రశంసించారు.
ప్రజల ప్రాణాలు కాపాడడమే కాకుండా ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో సైతం వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రీతి పటేల్ కొనియాడారు.వారి సేవలు వెలకట్టలేనివని, అయినప్పటికీ ఉచితంగా వీసాల గడువును పొడిగిస్తూ.
ఈ యోధుల సహకారం ఎంత విలువైందో బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచానికి తెలియజేస్తోందని ఆమె అన్నారు.
కాగా, కరోనా మహమ్మారి బ్రిటన్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.కొత్తగా వెలుగు చూసిన ఉత్పరివర్తనం చెందిన కరోనా స్ట్రెయిన్ ధాటికి భారీగా కేసులు నమోదవుతున్నాయి.వైరస్ను కట్టడి చేసేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా.కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.
వైద్యులు, సిబ్బంది ఎంతగా కృషి చేస్తున్నా.వైరస్ అదుపులోకి రావడం లేదు
.