వివాహం పేరిట ఇటీవల ప్రవాస భారతీయులను బురిడీ కొట్టించి వారి వద్ద నుంచి భారీగా దండుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు.దేశం కానీ దేశంలో వుండటం.
భారతదేశంలో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో ఎన్ఆర్ఐలు మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్ల ద్వారా సంబంధాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నారు.దీనిని అలుసుగా చేసుకుంటున్న మోసగాళ్లు… ప్రవాసుల్ని నిలువునా ముంచేస్తున్నారు.
అయితే ఈ స్టోరీలో మాత్రం ఓ ఎన్ఆర్ఐ చేతిలోనే మహిళ మోసపోయింది.ఆ బాధితురాలు లాయర్ కావడం ఇక్కడ కొసమెరుపు.
వివరాల్లోకి వెళితే.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో స్థిరపడిన అమేజ్ లోఖండ్వాలా అనే ప్రవాస భారతీయుడికి ఢిల్లీ దర్వాజాలోని సలాత్వాద్కు చెందిన 29 ఏళ్ల మహిళా న్యాయవాదికి 2020 ఏప్రిల్లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో అప్పటి నుంచి తరచూ చాటింగ్ చేసుకునే వారు.సదరు న్యాయవాది పూర్తిగా తన మాయలో పడిపోయిందని నిర్థారించుకున్న తర్వాత ఆ ఎన్ఆర్ఐ తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టాడు.
ఒకరోజు తనకు 34 ఏళ్లని, ఏళ్లు గడుస్తున్నా తనకు ఇంకా పెళ్లి కాలేదని, సంబంధాల కోసం వెతుకుతున్నట్లు న్యాయవాదితో చెప్పాడు.ఆ మాటలకు మరింత బలం చేకూర్చేందుకు గాను ఓ నకిలీ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసి ఆమెకు పంపించాడు.
దానిని చూసిన మహిళా న్యాయవాది నిజమేననుకుని నమ్మేసింది.ఈ నేపథ్యంలో లోఖండ్వాలాను పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలిపింది.నాటి నుంచి ఇద్దరి మధ్య చనువు మరింత పెరగడంతో ఆమె ఫొటోలతో పాటు వ్యక్తిగత మొబైల్ నెంబర్ కూడా తీసుకున్నాడు లోఖండ్వాలా.
ఈ వ్యవహారం ఇలా నడుస్తూ.
నిశ్చితార్ధం చేసుకోవాలని భావిస్తున్న వేళ ఒకరోజు లాయర్కు ఓ ఫోన్ వచ్చింది.లోఖండ్వాలాకు వివాహమైందని, అతని వయస్సు 48 ఏళ్లని, 17 ఏళ్ల కూతురు కూడా ఉన్నట్లు అవతలి వైపు నుంచి ఓ మహిళ స్వరం గట్టిగా వినిపించింది.
అది విన్న న్యాయవాది ఖంగుతింది.వెంటనే లోఖండ్వాలాకు ఫోన్ చేసి నిలదీసింది.
అయినప్పటికీ అతను ఆమెను తప్పుదారి పట్టించేందుకు మరో కట్టుకథ చెప్పాడు.తనకు నిజంగా పెళ్లి కాలేదని, నీకు ఫోన్ చేసిన మహిళ తన సోదరుడి భార్య అని, వారిద్దరికి సంబంధించిన ఓ పెళ్లి ఫొటోను కూడా లోఖండ్వాలా ఆమెకు పంపించాడు.
అతని మాటలు విని మళ్లీ నిజమేనని నమ్మింది బాధితురాలు.
కొద్ది రోజుల తర్వాత ఇంతకుముందు లాయర్కు ఫోన్ చేసిన మహిళ ఈసారి వాట్సాప్ వీడియో కాల్ చేసింది.
అందులో లోఖండ్వాలా పక్కన ఓ మహిళ ఉండడం కనిపించింది.అందులో కనిపిస్తున్న మహిళని తానేనని, అతని భార్యని అని చెప్పింది.లోఖండ్ వాలా నిజస్వరూపం బట్టబయలు కావడంతో తాను మోసపోయానని గ్రహించింది బాధితురాలు.దాంతో అప్పటి నుంచి అమేజ్తో మాట్లాడటం మానేసింది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్ఆర్ఐ… తన వద్ద ఉన్న న్యాయవాది ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో పెట్టాడు.ఆమెను ఒక వ్యభిచారిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
ఆ ఫొటోలు చూసిన బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది.ఎన్ఆర్ఐ చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
.