దేశంలో రోజురోజుకీ ఊహించని విధంగా లక్షల్లో కొత్త పాజిటివ్ కరోనా కేసులు బయటపడుతూ ఉండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే వైరస్ విజృంభిస్తున్న రాష్ట్రాలలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తూ లాక్ డౌన్ కూడా విధిస్తూ ఉన్నారు.
దీంతో దేశంలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన పరిస్థితి నెలకొంది.తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు బయట పడుతున్న నేపథ్యంలో టీటీడీ సర్వ దర్శనం టోకెన్ జారీ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.వచ్చే ఆదివారం నుండి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ లను నిలిపి వేయాలని డిసైడ్ అయ్యింది.
తిరుపతి నగరంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఊహించని విధంగా బయటపడుతూ ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ముఖ్యంగా ఈ టోకెన్ల కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలో వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో నిలబడుతూ ఉండే పరిస్థితులు ఉండటంవల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది .