కరోనా వైరస్పై మాట్లాడుతూ.మరోసారి ఉద్వేగానికి గురయ్యారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
కరోనాపై పోరులో అగ్రరాజ్యం ఇంకా జీవన్మరణ పోరులోనే ఉందని… ఇంకా పని పూర్తి కాలేదని ఆయన స్పష్టం చేశారు.అధికారంలోకి వచ్చిన కేవలం 75 రోజుల వ్యవధిలోనే 150 మిలియన్ల డోసులు అందించిన క్రమంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.మంగళవారం వాషింగ్టన్లోని ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం బైడెన్ మాట్లాడుతూ… మహమ్మారి కారణంగా 5.56 లక్షల మంది అమెరికన్లు మరణించారని, ఎంతోమంది చావు బతుకుల మధ్య వున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కానీ ఇది ఇక్కడితో ఆగదని, రాబోయే రోజుల్లో మనం ఇంకెన్ని మరణాలు, కష్టాలను చూడబోతున్నామనేది చెప్పలేమని బైడెన్ అభిప్రాయపడ్డారు.ఈ నెల 19 నుంచి అమెరికాలోని వయోజనులందరూ టీకా తీసుకోవడానికి అర్హులని ప్రకటించారు.18 ఏళ్లు పైబడిన వారందరూ వీలైనంత త్వరగా సాధ్యమైనంత ఎక్కువ మంది తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు తీసుకోవాలని ఈ సందర్భంగా అమెరికన్లకు బైడెన్ పిలుపునిచ్చారు.అందరికీ టీకా అందేంత వరకూ ప్రజలు తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని ఆయన సూచించారు.
దేశ స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4 నాటికి ప్రతి అమెరికా పౌరుడు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఒకవేళ దేశమంతా వ్యాక్సిన్ తీసుకుంటే.జూలై నాలుగవ తేదీన కోవిడ్ నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చినట్లే అని బైడెన్ స్పష్టం చేశారు.మే ఒకటో తేదీ నాటికి ప్రతి రాష్ట్రంలో ఉన్న వృద్ధులు టీకాలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం వయసు, ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా టీకాలు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
కాగా ఇప్పటికే టెక్సాస్ రాష్ట్రం వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.మార్చి నెలాఖారు నుంచి వయోజనులందరికీ కొవిడ్ టీకా వేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.రాష్ట్రంలోని వయోజనులందరూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సెంటర్లలో తప్పనిసరిగా టీకా తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.16 ఏళ్లకు పైబడిన వారు ఫైజర్, 18 ఏళ్లకు పైబడిన వారు మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ డోసులు తీసుకోవడానికి అర్హులని తెలిపారు.ఇప్పటి వరకు టెక్సాస్లో కోటి మందికి వ్యాక్సినేషన్ జరిగిందని వైద్య శాఖ ప్రకటించింది.
వయోబేధం లేకుండా అన్ని వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న రాష్ట్రాలలో అలాస్కా, ఆరిజోనా, మిస్సిసిప్పీల తొలి మూడు స్థానాల్లో వుండగా.నాల్గో స్థానంలో టెక్సాస్ నిలిచింది.
అటు మరో రాష్ట్రం కనెక్టికట్ కూడా 16 ఏళ్లకు పైబడిన వారందరికీ ఏప్రిల్ 5 నుంచి టీకాలు ఇస్తామని వెల్లడించింది.