గుంటూరు జిల్లా లో అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.ఒక శిశువు మూడు కాళ్లతో జన్మించడంతో గుంటూరు జీజీహెచ్ చెందిన వైద్య అధికారులు అరుదైన సర్జరీ నిర్వహించి విజయం సాధించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడేనికి వెంకటేశ్వరమ్మ, మోహన్ రావు దంపతులకు ఆడ శిశువు జన్మించింది.ఆ చిన్నారి పుట్టుకతోనే మూడు కాళ్ళతో జన్మించింది.
ఆ మూడో కాలు నడుము భాగం నుంచి ఏర్పడినట్లు వైద్యులు తెలియజేశారు.
ఈ క్రమంలో వైద్యుల సూచనల మేరకు చిన్నారిని గుంటూరులోని జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్య అధికారులు శిశువుకు త్రీడీ ఎమ్మారై, త్రీడీ సీటీస్కాన్ ద్వారా నడుము లోపలి భాగం నుంచి మూడో కాలు వచ్చినట్లు గ్రహించారు.అలాగే మూడో కాలి వద్ద పురుష జననాంగాలు ఏర్పడి రెండో కాళ్లకు సంబంధించిన నరాలు అతుక్కొని ఉన్నట్లు గుర్తించారు.
మూడో కాలు తొలగించడానికి న్యూరో విభాగానికి చెందిన వైద్యులు శేషాద్రిశేఖర్, హనుమ శ్రీనివాసరెడ్డి అరుదైన సర్జరీ నిర్వహించడం వల్ల తొలిగించవచ్చని తల్లిదండ్రులకు తెలిపారు.వాస్తవానికి ఇలా జన్మించడానికి గల కారణం విషయానికి వస్తే ఇది ఒక రకమైన వైకల్యమని, చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయని డాక్టర్లు తెలిపారు.
దీనిని వైద్య పరిభాషలో లంబార్ మైలో మెనింగోసీల్ విత్ ట్పైపీడస్ డిఫార్మటీపిలుస్తారు అని తెలిపారు.ఈ అరుదైన చికిత్సను డాక్టర్లు విజయవంతంగా నిర్వహించినందుకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇటీవలే ప్రభుత్వం రూ.1.5 కోట్లు ఖరీదు చేసే అత్యాధునిక లైకా మైక్రోస్కోప్ వైద్య పరికరాన్ని న్యూరోసర్జరీ విభాగానికి అందచేయడం వల్లనే సర్జరీ విజయవంతం చేయగలరని వైద్యులు పేర్కొంటున్నారు.అలాగే ఎంతో అధిక ఖర్చుతో కూడుకున్న ఈ అరుదైన చికిత్సకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ అందించినందుకు ఆ చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.