జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన అనేక కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి.ఇప్పటికే ఈ కేసులో జగన్ 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చారు.
అక్రమాస్తుల కేసులో ఏ 1 గా జగన్ ఉన్నారు.చాలా కాలంగా బీజేపీతో జగన్ సన్నిహితంగా మెలుగుతూ ఉండడంతో, ఆయనపై సిబిఐ దూకుడుగా వ్యవహరించడం లేదని అంతా అనుకున్నారు.
అయితే ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి, వైసిపి మధ్య వైరం నెలకొన్న తరుణంలో, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.జగన్ 11 చార్జిషీట్లలో a1 నిందితుడిగా ఉన్నారని, రఘురామకృష్ణంరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు.
తాను రాజ్యాంగంపై ప్రమాణం చేశానని, తమ పార్టీకి చెడ్డపేరు రాకుండా చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.ఈ వ్యవహారాలపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయడం వెనక కారణాన్ని కూడా రఘురామకృష్ణంరాజు వివరించారు.జగన్ ఈ కేసుల నుంచి త్వరగా బయటపడాలి అనే ఉద్దేశంతోనే ఈ పిటిషన్ వేసినట్టు , వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ పిటిషన్ దాఖలు చేశానని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
ఇన్ని చార్జిషీట్లు వేసినా విచారణలో జాప్యం జరుగుతోందని, కోర్టుకు వెళ్లకపోవడం పైన అనేక అనుమానాలు ఉన్నాయని, పార్టీకి చెందిన వ్యక్తిగా పార్టీని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ పిటిషన్ వేసినట్లు రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు.
కాకపోతే కీలకమైన తిరుపతి ఉప ఎన్నికలు, పరిషత్ ఎన్నికల సమయంలో జగన్ బైయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు కావడం ఖచ్చితంగా వైసీపీకి మేలు చేస్తుంది అని, బిజెపి ఈ రకంగా జగన్ ను వేధిస్తుంది అనే సంకేతాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది అనే భయమూ ఇప్పుడు వైసీపీ ప్రత్యర్ధలలో నెలకొంది.