చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కారణంగా గడిచిన ఏడాది కాలంగా మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయిపోయాడు.పార్టీలు, విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు మొత్తం బంద్ అయ్యాయి.
కనీసం పక్క వూరిలో వున్న ఆత్మీయులను కలవడానికి కూడా వీలు లేకుండా పోయింది.వైరస్ను కట్టడి చేసేందుకు గాను ఆయా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.
వీటి కారణంగా ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) శుభవార్త చెప్పింది.
పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్న వారు ఎటువంటి టెస్టులు, స్వీయ నిర్బంధం అవసరం లేకుండా అమెరికాలో పర్యటించవచ్చని పేర్కొంది.ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.కరోనా విజృంభణ నేపథ్యంలో పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నవారికి వైరస్ సంక్రమణ ముప్పు తక్కువగా ఉంటుంది.ఈ కారణం చేత వారు ఎటువంటి కొవిడ్ పరీక్షలు చేసుకోకుండా అమెరికాలో పర్యటించవచ్చని సీడీసీ తెలిపింది.
కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించే వారు ప్రయాణం అనంతరం కూడా స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.అయితే వివిధ గమ్యస్థానాలు నుంచి వచ్చేవారు, అమెరికా నుంచి ఆయా దేశాలకు వెళ్లాల్సిన వారు మాత్రం స్థానిక ప్రభుత్వాలు అమలు చేస్తున్న మార్గదర్శకాలను పాటించాలని సీడీసీ వెల్లడించింది.కొవిడ్ టీకా తీసుకోని ప్రయాణికులు మాత్రం ప్రయాణానికి ఒకటి నుంచి మూడు రోజుల ముందుగా వైరస్ నిర్థారణా పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలని సీడీసీ డైరెక్టర్ వాలేన్స్కీ తెలిపారు.దీనితో పాటు ప్రయాణం అనంతరం కూడా వారం పాటు క్వారంటైన్లో ఉండి తర్వాత మళ్లీ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.
అయితే టీకా వేయించుకున్నా, వేయించుకోకపోయినా అందరూ ఫేస్ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని వాలేన్స్కీ పేర్కొన్నారు.అన్ని దేశాల్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోనివాళ్లు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిదని ఆయన వెల్లడించారు.
కాగా, కరోనా మొదలైన నాటినుంచీ విమానరంగం సంక్షోభంలో కూరుకుపోయింది.ఈ క్రమంలో… నష్టాన్ని భరించలేక చాలా సంస్థలు ఉద్యోగులను తొలగించాయి.
కొన్ని నెలలుగా చాలా దేశాల్లో కరోనా అదుపులోకి రావడంతో విమాన సర్వీసులు మళ్ళీ ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో… విమానయాన రంగం కోలుకుంటుందని అంతా భావించారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పలు దేశాలు విమాన రాకపోకలను నిషేధించాయి.ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన విమానయాన రంగానికి ఇది తీరని దెబ్బేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.