వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.దీంతో ఇప్పటికే పలు కీలక పదవులను భారత సంతతి వ్యక్తులు అధిరోహించారు.
అలాగే ఆయా దేశాల్లో రాజకీయ నాయకులుగాను కీలక పాత్ర పోషిస్తున్నారు.అమెరికాలో కమలా హారీస్, నిక్కీ హేలీ, తులసీ గబార్డ్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, వివేక్ మూర్తి.
యూకేలో ప్రీతి పటేల్, రుషి సునక్ వంటి వారు కీలక స్థానాల్లో వున్నారు.తాజాగా జర్మనీలో భారతీయుడు చరిత్ర సృష్టించాడు.
హర్యానాకు చెందిన రాహుల్ కుమార్ గత నెలలో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఆమ్ మెయిన్లో నగర పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యాడు.తద్వారా జర్మనీలో నగర పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత వహించారు.
కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన కుమార్ ఉన్నత విద్య కోసం జర్మనీకి వెళ్లారు.ఆ తర్వాత బ్యాంకింగ్, ఆటోమోటివ్, వైద్య రంగాలతో సహా వివిధ పరిశ్రమలలో పనిచేశారు. ఫ్రాంక్ఫర్ట్ సిటీ పార్లమెంట్ సభ్యునిగా బరిలో నిలిచిన రాహుల్ కుమార్… తన ప్రచార వెబ్సైట్లో ఫ్రాంక్ఫర్ట్ ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజలకు గమ్యస్థానంగా నిలిచిందని చెప్పారు.2013 నుంచి రాహుల్ కుమార్ రాజకీయాల్లో చురుకుగా వుంటున్నారు.2017లో ఫ్రీ డెమొక్రటిక్ పార్టీ (ఎఫ్డీపీ) స్థానిక ఛైర్మన్గా ఎన్నికయ్యారు.2020లో ఫ్రీ ఓటర్స్ పార్టీలో చేరిన రాహుల్.ఫ్రాంక్ఫర్ట్ వెస్ట్కు చైర్మన్గా నియమితులయ్యారు.
వలసదారులకు మెరుగైన జీవన పరిస్ధితులను కల్పించడంతో పాటు గొప్ప సాంస్కృతిక వైవిధ్యం వున్న నగరం కోసం పనిచేస్తానని రాహుల్ కుమార్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు.అందరికీ ఉచితంగా జర్మన్ భాషను నేర్పించడం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు వంటి హామీలను ఫ్రీ ఓటర్స్ పార్టీ ఇచ్చింది.ఇవి రాహుల్ కుమార్ విజయానికి దోహదం చేశాయి.
ఈ ఎన్నికల్లో రాహుల్ సుమారు 30 మంది అభ్యర్ధులపై గెలిచారు.మొత్తంగా 300 మందికి పైగా అభ్యర్ధులు పోటీలో నిలవడం విశేషం.
ఇక మెడికల్ జర్నల్ ‘‘డెర్ ఇంటర్నిస్ట్’’కు రాహుల్ కుమార్ రెగ్యులర్ రైటర్గా వ్యవహరిస్తున్నారు.ఐటీ పరిశ్రమపై ఆయనకున్న ఆసక్తితో కెల్స్టర్బచ్లో సొంత సంస్థను స్థాపించడానికి దారి తీసింది.
సమాజానికి ఎంతో కొంత చేయాలని రాహుల్ బలంగా విశ్వసిస్తారు.అదే స్పూర్తితో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఐహెచ్కే) తరపున సెమినార్లను నిర్వహిస్తూ వస్తున్నారు.