తెలుగుదేశం పార్టీలో ముసలం స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది.వరుస ఓటములతో కుదేలైన టీడీపీ ఈ మధ్యకాలంలో బాగా బలం పుంజుకున్నట్టు కనిపించినా, పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదనే విషయం ఈ మధ్య జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో అర్థం అయిపోయింది.
2019 ఎన్నికలలో పార్టీ ఓటమి చెందినప్పటి నుంచి చంద్రబాబు పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు.రకరకాల మార్గాల ద్వారా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు.
గతంతో పోలిస్తే పార్టీ బాగా బలం పుంజుకుంది అని అంత అభిప్రాయపడుతున్న సమయంలో, ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి.వైసీపీ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున వలసలు చోటుచేసుకున్నా, ఆ తర్వాత ఆ వలసలకు బ్రేకులు పడిపోయాయి.
అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా కృష్ణా జిల్లాలో తెలుగు తమ్ముళ్లు పక్క చూపులు చూస్తుండడం చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పటికే కృష్ణాజిల్లాలో కీలక నాయకులుగా ఉంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని , చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మధ్య వైరం తీవ్ర స్థాయిలో ఉంది.ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది.
ఇక టీడీపీ అధిష్ఠానం సైతం నాని విషయంలో అంత సానుకూలంగా లేకపోవడంతో, ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అసలు కేశినేని నాని ఎప్పుడో బిజెపిలో చేరాల్సి ఉన్నా, ఆయన కుమార్తె శ్వేత విజయవాడ మేయర్ చేయాలని, అది సాధ్యం కావాలి అంటే టీడీపీలోనే ఉండాలనే ఉద్దేశంతో ఆయన మౌనంగానే ఉంటూ వచ్చారు.
ఇక విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయం బుద్ధా వెంకన్న ,బోండా ఉమా వంటివారు నాని తీరుపై బహిరంగంగా విమర్శలు చేయడం వంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం టీడీపీ కోలుకునే అవకాశం లేకపోవడం, చంద్రబాబు వయోభారం , పార్టీ భవిష్యత్తు అయోమయం గా ఉండడం, ఇలా రకరకాల కారణాలతో నాని మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి నాయకులు టీడీపీ బిజెపి జనసేన వైసిపి వంటి పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.పైకి కనిపించకపోయినా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తీవ్రం అవ్వడంతో నాయకుల వలసలకు కారణమట.అన్ని జిల్లాల్లో కంటే టిడిపి కి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కృష్ణ జిల్లా నుంచే ఈ వలసలు తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయట.