మలయాళ నటుడే అయినప్పటికీ జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మోహన్ లాల్. మోహల్ లాల్ డబ్బింగ్ సినిమాలు సైతం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లవుతున్నాయి.
మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 సినిమా మలయాళం వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.అయితే ఈ మలయాళ సూపర్ స్టార్ ఒక కారు డ్రైవర్ ను కోటీశ్వరుడిని చేశారు.
తను సూపర్ స్టార్ గా ఎదగడంతో పాటు తన దగ్గర పని చేసిన డ్రైవర్ ను స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగేలా చేశారు.మోహన్ లాల్ వల్ల స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన ఆ వ్యక్తి పేరు అంటనీ పెరుంబావూరు.
మోహన్ లాల్ పట్టణ ప్రవేశం మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఆ సినిమా నిర్మాత సూచనల మేరకు అంటనీ మోహన్ లాల్ ను ఇంటి నుంచి కారులో సెట్ కు తీసుకురావడంతో పాటు షూటింగ్ అయిపోయిన తరువాత ఇంట్లో దింపేవారు.
పట్టణ ప్రవేశం షూటింగ్ చివరి రోజున మోహన్ లాల్ ను ఆంటనీ ఇంటి దగ్గర దింపగా లాల్ ఆంటనీని తన ఇంట్లో భోజనం చేయాలని కోరారు.
ఆ మాటతో సంతోషపడిన ఆంటనీ షూటింగ్ లో తింటానని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు.ఆ తరువాత సొంతూరుకు వెళ్లిన ఆంటనీ మోహన్ లాల్ కు కొంతకాలం కారు డ్రైవర్ గా పని చేశానని స్నేహితులకు చెప్పగా అతని మాటలు ఎవరూ నమ్మలేదు.
ఒకరోజు ఆంటనీ నివశించే ఊరికి దగ్గర్లోనే మోహన్ లాల్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు ఆంటనీకి తెలిసింది.నిజంగానే మోహన్ లాల్ దగ్గర పని చేశానని నమ్మించడం కోసం స్నేహితులతో షూటింగ్ జరిగే చోటుకు వెళ్లారు ఆంటనీ.అయితే మోహన్ లాల్ ను ఆంటనీ కలవడానికి ప్రయత్నించగా అనుమతించకపోవడంతో ఆంటనీ స్నేహితులు పకపకా నవ్వారు.ఆ తరువాత అక్కడే మోహన్ లాల్ ను కలవాలని ఎదురు చూస్తున్న ఆంటనీని మోహన్ లాల్ గుర్తు పట్టడంతో పాటు పిలిపించి పర్సనల్ డ్రైవర్ గా జాబ్ ఇచ్చారు.
అలా పర్సనల్ డ్రైవర్ అయిన ఆంటనీ కొంత కాలానికే మోహన్ లాల్ కు మేనేజర్ అయ్యారు.మోహన్ లాల్ నరసింహం అనే సినిమా కథ విన్న సమయంలో ఆ స్టోరీ మోహన్ లాల్ కు ఎంతో నచ్చింది.
ఆ సినిమాకు ఆంటనీని నిర్మాతగా ఉండాలని మోహన్ లాల్ సూచించగా అందుకు అతను సరేనన్నాడు.ఆ సినిమా హిట్ కాగా ఆంటనీ ఇప్పటివరకు 30 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు.
ఇటీవల విడుదలైన దృశ్యం 2 సినిమాకు కూడా ఆంటనీనే నిర్మాత కావడం గమనార్హం.