ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ ఒక లైన్ లో పడుతుంది అనుకుంటున్న సమయంలో, ఆ పార్టీలోని నాయకులు అంతా ఏకతాటిపైకి వచ్చి, పార్టీని మరింతగా బలోపేతం చేసి, అధికారంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టాలి.కానీ ఇప్పుడు కీలకమైన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బెజవాడ టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో విమర్శలు చేసుకుంటూ, బహింరంగంగా పార్టీ పరువుని బజారున పడేసే విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది.
ముఖ్యంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని టార్గెట్ గా, ఆ పార్టీలోని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తదితరులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
బాబు అడ్డు రాకపోతే, నానిని చెప్పుతో కొట్టేవాడిని అంటూ బుద్దా వెంకన్న విమర్శలు చేశారు.
ఇక బోండా ఉమా అయితే తీవ్ర పదజాలంతో కేశినేని నాని పై విమర్శలు చేశారు.
కేశినేని నాని తన కుమార్తె శ్వేతను విజయవాడ మేయర్ గా చేయాలని ఎప్పటి నుంచో కలలుకంటున్నారు.గట్టిగానే ముందునుంచి ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు.అయితే అప్పుడప్పుడూ అధిష్టానంపై తన అసంతృప్తిని చూపిస్తూ వస్తున్న నానికి ఝలక్ ఇచ్చేలా ఆమె కుమార్తెకు మేయర్ టికెట్ ఇవ్వరు అనే ప్రచారం జరిగినా, చువారికి టీడీపీ అధిష్టానం మేయర్ అభ్యర్థిగా శ్వేతను ప్రకటించింది. ప్రస్తుతం ఉదృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో కేశినేని నాని కి వ్యతిరేకంగా బెజవాడ పార్టీలోని కీలక నాయకులంతా మూకుమ్మడిగా గళం విప్పడం వెనక అధినేత చంద్రబాబు రాజకీయ చాణక్యం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే కేసినేని నాని విజయవాడ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి, అధిష్టానం పై అసంతృప్తిగానే ఉంటూ, అనేక సందర్భాల్లో చురకలు అంటించే విధంగా మాట్లాడారు.అలాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తో నానికి వైరం ఉన్న నేపథ్యం, ఇలా ఎన్నో కారణాలు, నాని ఇప్పుడు కాకపోయినా మరి కొద్ది నెలల్లో అయినా బీజేపీలో చేరతారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కాస్త ముందుగానే నానిని టీడీపీ అధిష్టానం దూరంపెడుతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.అలాగే టిడిపి అధిష్టానం విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేసినేని నాని కుమార్తె ప్రకటించినప్పటికీ ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులు గందరగోళం సృష్టిస్తున్నాయి.
అకస్మాత్తుగా నాని కుటుంబాన్ని బెజవాడ టిడిపి నాయకులు అంతా టార్గెట్ చేసుకోవడం వెనుక టీడీపీ అధిష్టానం పెద్దల ఆదేశాలు ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ గొడవ జరిగిన రోజే అంటే నిన్న రాత్రి అకస్మాత్తుగా కేశినేని శ్వేత తన తండ్రిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన బుద్దా వెంకన్న, బోండా ఉమ తదితర నాయకులను కలవడం, వారి మద్దతు తమకు ఉంది అని, ఈ గొడవ అంతా టీ కప్పులో తుఫాన్ అన్నట్టుగా కవర్ చేసే ప్రయత్నం చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.