తనపై ముగ్గురు మహిళలు చేసిన లైంగిక ఆరోపణలపై స్పందించారు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో.తనపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తాను మాత్రం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు.
ఒకవేళ తనకు తెలియకుండా తన ప్రవర్తనతో మనసు నొచ్చుకుని వుంటే ఆ ముగ్గురు తనను క్షమించాలని క్యూమో కోరారు.తనకు తెలిసినంత వరకు తాను ఎప్పుడూ వారిని అసభ్యంగా తాకలేదని గవర్నర్ వెల్లడించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలు తన పట్ల ఓ అభిప్రాయానికి రావొద్దని క్యూమో విజ్ఞప్తి చేశారు.
కాగా గత వారం షార్లెట్ బెన్నెట్ (25) అనే యువతి గవర్నర్ క్యూమో తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది.
గతేడాది నవంబరు వరకు న్యూయార్క్ గవర్నర్ కార్యాలయంలో ఆరోగ్య విధాన సలహాదారుగా బెన్నెట్ పనిచేసింది.అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలోనే గవర్నర్ ఆండ్రూ క్యూమో తనను లైంగికంగా వేధించారని బెన్నెట్ ఆరోపించింది.
గత ఏడాది జూన్ నెలలో కార్యాలయంలో ఒంటరిగా ఉన్న సమయంలో తనతో ఆండ్రూ క్యూమో అసభ్యంగా సంభాషించారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే, గవర్నర్ నేరుగా తనని తాకలేదని, ఆయనతో సంభాషించిన సమయంలో క్యూమో మాటలు తేడాగా వున్నట్లు అనిపించిందని బెన్నెట్ వెల్లడించింది.
గవర్నర్ తనతో గడపాలని ఆయన మాటలను బట్టి అర్ధం చేసుకున్న తనకు ఎంతో అసౌకర్యంగా, భయంకరంగా అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.అయితే, ఆ ఘటన జరిగిన వారం రోజుల్లోనే గవర్నర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ను ఒప్పించి వేరే విభాగానికి బదిలీ చేయించుకున్నట్లు బెన్నెట్ వెల్లడించారు.
ప్రస్తుతం అక్కడ సౌకర్యంగానే ఉండటంతో గవర్నర్ ప్రవర్తనపై ఎటువంటి విచారణ కోరలేదని షార్లెట్ బెన్నెట్ స్పష్టం చేశారు.
కాగా పదేళ్లుగా న్యూయార్క్కు గవర్నర్గా వ్యవహరిస్తున్న ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఈ వారంలో ఇది రెండోసారి.గత బుధవారం .2015 నుంచి 2018 వరకు క్యూమో వద్ద సలహాదారుగా పనిచేసిన లిండ్సే బొయ్లాన్ సైతం ఇదే రకమైన ఆరోపణలు చేశారు.తన పెదవులపై గవర్నర్ బలవంతంగా ముద్దు పెట్టాడని 36 ఏళ్ల బొయ్లాన్ ఆరోపించారు.స్ట్రిప్ పోకర్ ఆడదామని చెప్పి తనను వెనుక నుంచి తాకేందుకు ప్రయత్నించాడని ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా క్యూమో వద్ద పనిచేయాలని భావిస్తున్న వారు తన కథ చదవాలంటూ సంచలన ట్వీట్ చేశారు.వీరిద్దరితో పాటు అన్నా రూచ్ అనే మహిళ కూడా క్యూమోపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
వీటిని ఖండించిన గవర్నర్ కార్యాలయం.వరుస ఆరోపణలపై ఫెడరల్ న్యాయమూర్తి చేత స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో గవర్నర్ ఆండ్రూ క్యూమో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.