బాలయ్య సీన్లోకి దిగిపోయారు.తొడగొట్టేస్తున్నారు.
జగన్ కు, ఆయన ప్రభుత్వానికి వార్నింగ్ లు ఇస్తున్నారు.ఇప్పటి వరకు ఏదో ఆషామాషీగా రాజకీయాలు చేస్తూ, ఎక్కువగా సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మాత్రం సినిమాల సంగతి పక్కన పెట్టి, పూర్తిగా రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు.
కేవలం హిందూపురంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పర్యటనలు చేపట్టి తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం తేవాలనే కసితో ఉన్నారు.అయితే ఇదంతా బాలయ్యలో స్వయంగా వచ్చిన మార్పు అయితే కాదు.
దీనికి వెనుక ఉన్నది ఆయన బావా ప్లస్ వియ్యంకుడు చంద్రబాబు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, ఆ పార్టీలో బలమైన నాయకుల కొరత ఎక్కువగా ఉంది.ముఖ్యంగా గ్రామ స్థాయిలోనూ టీడీపీ పై ఆదరణ తగ్గిపోయింది.దీంతో ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీకి పాత రోజులను తీసుకురావాలంటే బాలయ్య వంటివారిని యాక్టివ్ చేసి రాష్ట్రమంతటా తిప్పితే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయంలో బాబు ఉన్నారు.
అదీ కాకుండా, ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలలో చేదు ఫలితాలు ఎదురవడం, తన ప్రతిష్టకు భంగం కలగడం వంటి కారణాలతో వెంటనే చంద్రబాబు ఆ నియోజకవర్గంలో పర్యటించారు.తిరుపతి ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు.
చిత్తూరు జిల్లా నాయకులతో మీటింగులు నిర్వహిస్తున్నారు.ఇదే మాదిరిగా టిడిపికి కంచుకోటగా ఉంటూ పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపి జెండా ఎగర వేస్తున్న హిందూపురం నియోజకవర్గం లో పట్టు చేజారిపోకుండా, మున్సిపల్ ఎన్నికల్లో పట్టు కాపాడుకునేందుకు రంగంలోకి దించారు.
హిందూపురం నియోజకవర్గంలో మున్సిపల్ అభ్యర్థుల తరఫున ప్రచారానికి దిగారు.మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో టిడిపి బాగా పట్టు కోల్పోవడంతో ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా సీమతో పాటు రాష్ట్రమంతా బాలయ్య సేవలను ఉపయోగించుకుని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయించాలనే ఆలోచనతో బాబు బాలయ్య ను గతం కంటే ఎక్కువగా యాక్టివ్ చేసి అటు నందమూరి అభిమానులతో పాటు, టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకు వచ్చే పనిలో ఉన్నారు.
ఇక బావ ఆదేశాలతో బాలయ్య కూడా తన సినీ అభిమానులను యాక్టివ్ చేయడమే కాకుండా.పంచులు, ప్రాసలతో వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడే ఆలోచనలో ఉన్నారట.