స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వలసలను పూర్తిగా అడ్డుకునేందుకు గాను డొనాల్డ్ ట్రంప్ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అవలంభించారు.వీటిలో ఒకటి గ్రీన్కార్డులపై నిషేధం.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అప్పటికే ఉపాధి లేక రోడ్డునపడ్డ అమెరికన్ల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే కారణంతో ట్రంప్ సర్కారు వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధించింది.దీని వల్ల దేశంలో నిరుద్యోగం ఎక్కువైపోతుందని ఆరోపిస్తూ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించింది.
అయితే దీని వల్ల సుమారు 4.73 లక్షల క్వాలిఫైడ్ గ్రీన్కార్డు దరఖాస్తులు నిలిచిపోయాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.గ్రీన్ కార్డుల జారీపై ట్రంప్ నిషేధం అమలు చేయడం వల్ల 1.20 లక్షల మంది వీసాలు కోల్పోయారు.గ్రీన్ కార్డు అంటే అమెరికాలో శాశ్వత పౌరసత్వం కల్పించే శాశ్వత నివాస కార్డు .అమెరికాలో ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించి హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న విదేశీయులకు అమెరికా గ్రీన్ కార్డులు జారీ చేస్తుంది.అలాగే ప్రతి దేశానికి ప్రతి ఏటా ఏడు శాతం మాత్రమే గ్రీన్ కార్డులు జారీ చేస్తామన్న ట్రంప్ విధానం భారతీయులు సహా విదేశీ వృత్తి నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపింది.
అయితే ఇటీవల దీనిపై సమీక్ష జరిపిన జో బైడెన్ యంత్రాంగం ట్రంప్ నిర్ణయం వీసా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని తెలిపింది.
దీంతో గ్రీన్కార్డులపై వున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.అమెరికన్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులను ఉపయోగించుకోకుండా ట్రంప్ నిర్ణయం అవరోధంగా మారిందని బైడెన్ తెలిపారు.
దీనితో పాటు 2020 సంవత్సరం వీసాలు పొందిన, పొందాలనుకున్న వారికి నష్టదాయకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బైడెన్ చెప్పినట్లుగానే ‘‘ ది డైవెర్సిటీ వీసా ప్రోగ్రాం (గ్రీన్కార్డ్ లాటరీ) ప్రొగ్రామ్’’ పై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.ఈ కార్యక్రమం కింద అమెరికా ప్రతి ఏటా 55 వేల మందికి గ్రీన్కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.ట్రంప్ యంత్రాంగం నిర్ణయం వల్ల దాదాపు 5 లక్షల మంది అర్హులైన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
ఇలాంటి పరిస్ధితుల్లో బైడెన్ నిర్ణయంతో డీవీ లాటరీ విజేతలు, వీసా దరఖాస్తు దారులకు పెద్ద ఊరట కలిగినట్లయ్యింది.
అలాగే గ్రీన్ కార్డులపై దేశాల కోటా పరిమితిని సైతం బైడెన్ ఎత్తేయడంతో పాటు అమెరికాలో అక్రమంగా వుంటున్న 1.1 కోట్ల మంది వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని ప్రభుత్వం కాంగ్రెస్లో ప్రవేశపెట్టింది.ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రీన్కార్డు మంజూరులో ఏడు శాతం దేశాల కోటాను ఎత్తేస్తూ మొదట దరఖాస్తు చేసుకునే వారికి మొదట గ్రీన్కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పు చేశారు.
దీంతో పదేళ్లకు పైబడి గ్రీన్కార్డుల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు మేలు కలగనుంది.