అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..
మరో భారతీయుడికి కీలక బాధ్యతలు అప్పగించారు.తనకు ఉప సహాయకుడిగా, వైట్హౌస్ మిలటరీ ఆఫీస్ డైరెక్టర్గా ఇండో అమెరికన్ మజూ వర్గీస్ను నియమించారు.
కేరళలోని తిరువల్లకు చెందిన ఈయన తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే అమెరికాకు వలస వెళ్లారు.మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేశారు వర్గీస్.2015 నుంచి 2017 వరకు నిర్వహణ, పరిపాలనా విభాగాల్లో అధ్యక్షుడికి సహాయకుడిగా పనిచేశారు.ఆ సమయంలో వైట్హౌస్ బడ్జెట్, సిబ్బంది, సౌకర్యాలు, పర్యటనలు, ప్రధాన కార్యక్రమాల పర్యవేక్షణతో పాటు వైట్హౌస్ కాంప్లెక్స్ రోజువారీ కార్యకలాపాలను వర్గీస్ పర్యవేక్షించారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన వర్గీస్ గతేడాది బైడెన్ – హారిస్ ఎన్నికల ప్రచారంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా, సీనియర్ అడ్వైజర్గా సేవలందించారు.వైట్హౌస్ మిలటరీ కార్యాలయం .అక్కడ జరిగే పలు అధికారిక వేడుకలు, వైద్య సదుపాయం, అత్యవసర సేవలు, అధ్యక్షుని ప్రయాణాలు వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది.అమెరికా అధ్యక్షుడు వివిధ దేశాల పర్యటనకు వెళ్లేందుకు ఉపయోగించే ఎయిర్ఫోర్స్-వన్ డైరెక్టరు కనుసన్నల్లోనే ఉంటుంది.
వర్గీస్ వీటన్నింటికీ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు.కరోనా విజృంభణ, క్యాపిటల్ భవనంపై దాడులు వంటి విపత్కర పరిస్ధితుల్లో బైడెన్- హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరగడం వెనుక వర్గీస్ కీలకపాత్ర పోషించారు.
ఇక బైడెన్ జట్టులో కమలా హారిస్, నీరా టాండన్, డాక్టర్ వివేక్ మూర్తి, వినయ్ రెడ్డి,వేదాంత్ పటేల్,వనితా గుప్తా, ఉజ్రా జాయే, మాలా అడిగా,గరీమా వర్మ,సబ్రీన్ సింగ్, సమీరా ఫజిలి, భరత్ రామ్మూర్తి తదితరులు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.ఈ టీమ్లోకి భారత సంతతికి చెందిన నీరా టాండన్ సైతం చేరేవారు.కానీ ఆమె నియామకంపై సెనెట్తో పాటు డెమొక్రాట్ల నుంచి వ్యతిరేకత రావడంతో అధ్యక్షుడు జో బైడెన్ వెనక్కి తగ్గక తప్పలేదు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే బైడెన్కు ఆయన కేబినెట్కు ఎదురైన తొలి ఓటమిగా విశ్లేషకులు దీనిని అభివర్ణిస్తున్నారు.
తన నామినేషన్ ను విత్ డ్రా చేయాలని నీరా కోరడంతో తాను అంగీకరించానని బైడెన్ ఓ ప్రకటనలో తెలియజేశారు.ఆమె అనుభవం, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యంపై తనకెంతో గౌరవం ఉందని, త్వరలోనే టాండన్ మరో కీలకమైన పదవిలోకి వస్తారని ఆయన ఆకాంక్షించారు.