టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అసాధ్యుడు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటూ వచ్చింది.అటువంటి అసాధ్యుడు కాబట్టే ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం కోసం పార్టీని స్థాపించి , ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని చివరికి ప్రత్యేక తెలంగాణ ను సాధించి తెలంగాణ ప్రజల్లో హీరో అయ్యాడు.
ఆ క్రెడిట్ తోనే రెండుసార్లు పార్టీని అధికారంలోకి కేసీఆర్ తీసుకురాగలిగాడు.మొదటి విడతలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంపైనే దృష్టి పెట్టి, ప్రజలను బాగా ఆకట్టుకుంది.
ఆ నమ్మకంతోనే రెండోసారి టిఆర్ఎస్ కు అధికారం జనాలు కట్టబెట్టారు.అయితే రెండో సారి మాత్రం టిఆర్ఎస్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
అదే సమయంలో బలహీనంగా ఉన్న రాజకీయ శత్రువులు బలపడుతూ ఇప్పుడు టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించే పరిస్థితికి వారు వెళ్ళారు.
దీనంతటికీ కారణం ప్రజల్లో టిఆర్ఎస్ పలుకుబడి గతంకంటే బాగా తగ్గడమే.
మొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, కంటి వెలుగు ఇలా ఎన్నో ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టారు.ఇప్పుడు అవే పథకాలను కొనసాగిస్తున్నా, గతంలో టీఆర్ఎస్ పై ఉన్న ఆదరణ ఇప్పుడు కనిపించడం లేదు అనడానికి అనేక కారణాలు ఉన్నాయి.
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి, జిహెచ్ఎంసి ఎన్నికలలో బొటాబొటిగా గెలవడం వంటివి టిఆర్ఎస్ కు జనాలలో ఆదరణ తగ్గింది అని చెప్పడానికి నిదర్శనంగా మారింది.
ఇక ఇప్పుడు చూస్తే నాగార్జునసాగర్ లో ఉప ఎన్నికలు ఉండడంతో, ఆ పార్టీ బాగా ఆందోళన చెందుతోంది.ఇక్కడ గెలుపు తమ ఖాతాలో వేసుకోకపోతే రాజకీయ ప్రత్యర్థులు మరింత బలపడతారని, టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది అనే విషయం అందరికీ అర్ధం అవుతుందని బాగా టెన్షన్ పడుతున్నారట.అందుకే ఇప్పుడు పూర్తిగా పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసి ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని పూర్తిగా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ప్రభుత్వం పని చేస్తుందని నిరూపించుకునేందుకు కేసీఆర్ అష్టకష్టాలు పడాల్సి పరిస్థితి ఏర్పడింది.