ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న వైసీపీకి జనాల్లో అనుకున్నంత స్థాయిలో ఆదరణ లభించడం లేదనేది వాస్తవం.టీడీపీ పై అప్పట్లో జనాల్లో పెరిగిన అసంతృప్తి కారణంగానే వైసీపీకి ఇంతటి భారీ మెజార్టీ వచ్చింది.2019 ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి జనాలంతా జగన్ వైపే అని అంతా అంచనా వేశారు.టిడిపి ఇక ఎప్పటికీ కోలుకోలేదనే అభిప్రాయం జగన్ లో ఉంటూ వచ్చింది.
కానీ ఇప్పుడు చూస్తే వైసీపీపై కాస్తో కూస్తో జనాల్లో ఆగ్రహం పెరుగుతుండడం, అదే సమయంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు బల పడుతుండడం వంటి పరిణామాలు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.ఇవే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం తన పై ఆగ్రహంగా ఉన్నారనే విషయం జగన్ వరకు వెళ్ళింది.
తనపై ఉన్న అసంతృప్తితో ఎమ్మెల్యేలు చాలామంది ప్రజల్లోకి వెళ్లడం లేదని, పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారనే విషయం గుర్తించారు.ముఖ్యంగా వైసీపీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు జగన్ దర్శనం కలుగలేదు.
ఎన్నోసార్లు జగన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసినా, చాలామందికి సాధ్యపడలేదు.
తాము గెలిచి దాదాపు రెండేళ్లు అవుతున్నా, ఇప్పటి వరకు జగన్ దగ్గరకు వెళ్లలేకపోవడం , తాము అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా సాధ్యపడకపోవడం, జగన్ తమ నియోజకవర్గాలకు రాకపోవడం, ఇక నియోజకవర్గంలోనూ పూర్తిగా అధికారులు మీదుగానే ప్రభుత్వ పథకాలు జనాలకు చేరి పోతుండడం, తాము నామమాత్రం అయిపోవడం ఇలా ఎన్నో అంశాలు ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం ఏర్పాటు చేయకపోవడం, వారి సాధక బాధలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వంటి కారణాలతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిందని, అది పోగొట్టకపోతే ఎన్నికల నాటికి ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, పార్టీ ఎమ్మెల్యేలు ఇదే అసంతృప్తితో ఉంటే, అది పార్టీకి చేటు చేస్తుందనే ఆలోచనకు వచ్చిన జగన్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీపరంగానూ, ప్రభుత్వపరంగానూ వారికి కావలసిన ప్రయోజనాలు ఏంటి అనే విషయాలపైన సమావేశాలలో చర్చించి, వారిలో ఉన్న అసంతృప్తిని పోగొట్టాలని జగన్ చూస్తున్నారట.అదీకాకుండా, ఏప్రిల్ నుంచి రచ్చబండ కార్యక్రమం మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉండడంతో దాని కంటే ముందుగానే ఎమ్మెల్యేలందరితోనూ సమావేశం నిర్వహించి, పూర్తిగా వారిని యాక్టివ్ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.