2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ జెండా రెపరెపలాడింది.151 సీట్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని సీఎం పీఠమెక్కారు.మెజార్టీ ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు అనే విషయాన్ని 2019 ఎన్నికల్లో జగన్ రుజువు చేసుకున్నారు.ఇక అప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
నవరత్నాలు పేరుతో అనేక ప్రజాకర్షక పథకాలు జగన్ అమలు చేసి చూపిస్తున్నారు.ఇంకా ఎప్పటికప్పుడు అనేక ప్రజాకర్షక పథకాలు రూపొందిస్తూ, అమలు చేస్తూనే వస్తున్నారు.
ఏపీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జగన్ ఏమాత్రం లెక్కచేయకుండా, వెనక్కి తగ్గకుండా ప్రజలకు మేలు చేసే విషయంలో ముందడుగు వేస్తున్నారు.ఇది ఇలా ఉంటే, తాము అమలు చేస్తున్న పథకాల అమలు తీరు ఏవిధంగా ఉంది అనేది తెలుసుకునేందుకు జగన్ చాలా ఆసక్తిగా ఉన్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో వైసిపి మద్దతుదారులు దాదాపు 80 శాతం గెలిచినా, పార్టీ గుర్తుతో ఆ ఎన్నికలు జరగక పోవడంతో, వైసీపీ కి ఉన్న ఆదరణ ఎంత అనేది క్లారిటీ లేకుండా పోయింది.కానీ ఇప్పుడు జరిగే మున్సిపల్ కార్పొరేషన్, మేజర్ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తు తో జరిగేవి కావడంతో, వైసిపి బలం ఎంత అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో 75 మున్సిపాలిటీ, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి వీటితో పాటు అనేక మేజర్ పంచాయతీలలో పాగా వేసేందుకు వైసిపి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.ఆ బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ అప్పజెప్పారు.
పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచార శైలిని సైతం ప్రారంభించారు.తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేయగా, అందులో చాలామంది అధికార పార్టీలో చేరిపోవడం, వైసిపికి మద్దతుగా మరికొంత మంది ఉండడం, మరికొంతమంది వివిధ కారణాలతో ప్రచారానికి హాజరుకాకపోవడం వంటి పరిణామాలు అన్ని వైసీపీకి కలిసి వస్తాయని, ఎన్నికల ఫలితాల ద్వారా జనాల్లో ఆదరణ తగ్గలేదు అనే విషయాన్ని నిరూపించుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది.
ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాల ద్వారా, జనం నాడి ఏవిధంగా ఉందనేది రుజువు కాబోతుండడంతో ఈ ఎన్నికలపై జగన్ ఆసక్తిగానూ, టెన్షన్ గానూ ఉన్నారు.ఒకవైపు జనసేన, మరోవైపు బిజెపి, టిడిపి ప్రభుత్వం పై అదేపనిగా విమర్శలు చేస్తూనే వస్తున్నాయి.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలోని చిన్న చిన్న లోపాలను సైతం ఎత్తి చూపిస్తూ, ప్రజలలో ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం వంటి వ్యవహారాలతో ఇప్పుడు వచ్చే ఎన్నికల ఫలితాలు అన్నిటికీ సరైన సమాధానం చెబుతాయని జగన్ భావిస్తున్నరట.