రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వైస్ షర్మిల ఇప్పుడు తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనతో అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి ? ఏ విధంగా ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి ? పార్టీకి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ? వాటికి సమాధానం ఏవిధంగా చెప్పాలి ? ఇలా ఎన్నో ప్రశ్నలు వేస్తూ, వారి నుంచి సమాధానాలు రాబట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధమైన తరువాతే పార్టీ పేరును ప్రకటించి జనాల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు.
ఏప్రిల్ లో ఆమె పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక షర్మిల అన్నయ్య జగన్ ఏపీకి సీఎంగా ఉన్నా, ఆయన సహకారం తనకు లేదని, తాను ఒంటరిగానే తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అవుతాననే విధంగానే షర్మిల ముందుకు వెళ్తున్నారు.అయితే షర్మిల ఎక్కడా హడావుడి రాజకీయాలు చేయడం లేదు.
పార్టీ ఏర్పాటుకు ముందుగానే విద్యార్థులు, ఉద్యోగులు సీనియర్ రాజకీయ నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, రాజకీయ ఉద్దండులు, వివిధ కుల సంఘాల నాయకులు, జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న తటస్థ లు, ఇలా అందరినీ ముందుగానే తాను స్థాపించబోయే పార్టీలోకి తీసుకువచ్చే విధంగా వారికి అన్ని రకాలుగా భరోసా కల్పించి, తమ పార్టీలో యాక్టీవ్ చేసే విధంగా షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కీలకమైన స్థానాల్లో పనిచేసిన అధికారులతోనూ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.ఇప్పటికే వారంతా రిటైర్డ్ కావడంతో రాజకీయంగా మరికొంతమందిని యాక్టీవ్ చేయడం, మరి కొంతమందిని సలహాదారులుగా పార్టీ పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించే విధంగా షర్మిల అడుగులు వేస్తున్నారు.ముఖ్యంగా నల్గొండ, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం మొదలైన జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, మద్దతుదారుల అండదండలు తనకు ఉండేలా చూసుకుంటున్నారు.
ఇక పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని, అది కూడా అన్ని నియోజక వర్గాలు కవర్ అయ్యేలా , అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, దానికనుగుణంగా ప్రజల్లో సెంటిమెంటును రెచ్చగొట్టి, తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచనతో షర్మిల ముందుకు వెళ్తున్న తీరు చూస్తుంటే, షర్మిల రాజకీయం చాలా డిఫరెంట్ అనే విషయం అర్ధం అవుతోంది.