ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య మళ్లీ పొత్తు విచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే జనసేన పార్టీ బీజేపీ తో కలిసి ముందుకు వెళ్తున్నా, ఆ పార్టీ నేతలు జనసేన విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై చాలాకాలం నుంచి జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితోనే ఉన్నారు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బీజేపీతో కలిసి జనసేన పార్టీ ముందుకు వెళ్తోంది.బీజేపీ కోసం జనసేన సైతం ఎన్నో త్యాగాలూ చేసింది.
అయినా, జనసేన విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారింది.బీజేపీతో పొత్తు కారణంగా జనసేన బలపడే అవకాశాలు లేకపోవడం వంటి వ్యవహారాలపై పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో గ్రామస్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీ అనధికారిక పొత్తు పెట్టుకోవడం, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లడం వంటి కారణాలతో జనసేన కు ఊహించని విధంగా పంచాయతీ ఎన్నికలలో విజయం దక్కింది.ముఖ్యంగా గోదావరి ,కృష్ణాజిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.
అయితే ఈ ఆకస్మిక గ్రామస్థాయి పొత్తుల విషయంలో అటు టిడిపి, జనసేన అధిష్టానం అనుమతి ఉందో లేదో తెలియదు గాని ఫలితాలు అయితే మెరుగ్గా రావడంతో, మళ్లీ తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తోంది.ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు.
బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు.అయినా బీజేపీ పెద్దలు దూరం పెడుతూనే వస్తుండడం బాబుకు కాస్త ఆగ్రహాన్ని కలిగిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలోనే జనసేనతో కలిసి పొత్తుపెట్టుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.త్వరలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పొత్తు పెట్టుకోకపోయినా, ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేన తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో బాబు ఉన్నారట.
ఇక పవన్ సైతం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లే కంటే, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి అడుగులు వేస్తే మంచిదనే అభిప్రాయం లో ఉన్నట్టు సమాచారం.
ఏది ఏమైనా మరి కొద్ది నెలల్లో జనసేన టిడిపి పొత్తు విషయమై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు, ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికల వెళ్లి అధికారం దక్కించుకునే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.