డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తూ వస్తున్న కొత్త అధ్యక్షుడు జో బైడెన్ వలస విధానంలో మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.గ్రీన్కార్డు దరఖాస్తుదారులపై ఉన్న నిషేధాన్ని బైడెన్ ఎత్తివేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అప్పటికే ఉపాధి లేక రోడ్డునపడ్డ అమెరికన్ల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే కారణంతో ట్రంప్ సర్కారు వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధించింది.దీని వల్ల దేశంలో నిరుద్యోగం ఎక్కువైపోతుందని ఆరోపిస్తూ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించింది.
అయితే దీనిపై సమీక్ష జరిపిన జో బైడెన్ యంత్రాంగం.ట్రంప్ నిర్ణయం వీసా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడంతోపాటు.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని తెలిపింది.దీంతో దీనిని ఉపసంహరిస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
అమెరికన్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులను ఉపయోగించుకోకుండా ట్రంప్ నిర్ణయం అవరోధం కల్పిస్తుందని బైడెన్ తెలిపారు.దీనితో పాటు 2020 సంవత్సరం వీసాలు పొందిన, పొందాలనుకున్న వారికి నష్టదాయకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధ్యక్షుడు చెప్పినట్లుగానే ‘‘ ది డైవెర్సిటీ వీసా ప్రోగ్రాం (గ్రీన్కార్డ్ లాటరీ) ప్రొగ్రామ్’’ పై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.ఈ కార్యక్రమం కింద అమెరికా ప్రతి ఏటా 55వేల మందికి గ్రీన్కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ట్రంప్ యంత్రాంగం నిర్ణయం వల్ల దాదాపు 5 లక్షల మంది అర్హులైన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.ఇలాంటి పరిస్ధితుల్లో బైడెన్ నిర్ణయంతో డీవీ లాటరీ విజేతలు, వీసా దరఖాస్తు దారులకు పెద్ద ఊరట కలిగినట్లయ్యింది.
కాగా, అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా విదేశీయులకు ప్రతిబంధకంగా వున్న ఆంక్షలను ఎత్తివేయాలని జో బైడెన్ యంత్రాంగం నిర్ణయించిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా గ్రీన్ కార్డులపై దేశాల కోటా పరిమితిని ఎత్తేయడంతో పాటు అమెరికాలో అక్రమంగా వుంటున్న 1.1 కోట్ల మంది వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని ప్రభుత్వం గత వారం కాంగ్రెస్లో ప్రవేశపెట్టింది.ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రీన్కార్డు మంజూరులో ఏడు శాతం దేశాల కోటాను ఎత్తేస్తూ మొదట దరఖాస్తు చేసుకునే వారికి మొదట గ్రీన్కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పు చేశారు.
దీంతో పదేళ్లకు పైబడి గ్రీన్కార్డుల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది.