సహజంగా ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అనుకూలం గా వస్తాయి.ఇది ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుతం ఏపీలో మూడు విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు లభించాయి.త్వరలోనే జెడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కసరత్తు చేస్తున్నారు.
దీనికి తగ్గట్టుగానే అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.ఏవిధంగా ఈ ఎన్నికలలో పైచేయి సాధించాలని విషయంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి.
బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధం అవుతున్నాయి.అయితే అధికార పార్టీ వైసీపీ కి ఈ ఎన్నికల ఫలితాలు కాస్త నిరాశపరిచినట్టుగానే చెప్పుకోవాలి.
ఎందుకంటే గెలుస్తాము అనుకున్న స్థానాల్లోనూ బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపడం, అలాగే నియోజకవర్గ స్థాయి నాయకుల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలు ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించడం వంటి కారణాలతో జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా వైసీపీకి దక్కాల్సిన స్థానాల్లో పాగా వేశాయి. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నా, జగన్ఎందుకో మౌనంగానే ఉండిపోతున్నారు.
మరీ ముఖ్యమైన ఈ విషయం ను పట్టించుకోకుండా, కేవలం సంక్షేమ పథకాలే తమకు మళ్ళీ తిరిగి పట్టం కట్ట పెడతాయి అనే ఆలోచనతో ఉండిపోవడం, ఇలా ఎన్నో అంశాలు వైసీపీ ఇబ్బందికరంగా మారాయి.నాయకుల మధ్య పెరిగిపోతున్న ఈ విభేదాలు వైసిపి కొంపముంచేస్తాయి అనే ఆందోళన ఆ పార్టీ నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
మంత్రులు – ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు – ఎంపీల కు మధ్య సఖ్యత ఎక్కడా కనిపించడం లేదు.గ్రూపు రాజకీయాలు మొదటి నుంచి ఎక్కువైపోతున్నాయి.అయినా జగన్ వీటిని అరికట్టడంలో విఫలం అవుతూనే వస్తున్నారు.
ఇప్పటికే మూడు ప్రాంతాలకు ముగ్గురు పార్టీ ఇన్చార్జిలను నియమించినా, వారు సైతం ఈ విషయంలో చేతులెత్తేసినట్టే కనిపిస్తుండటంతో, వైసిపి పరిస్థితి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత దిగజారే విధంగా కనిపిస్తోంది.జగన్ వీటిపై సీరియస్ గా దృష్టి పెట్టకపోతే, రాజకీయ ప్రత్యర్థులు దీన్నే అవకాశంగా తీసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింతగా బలపడి, వైసీపీకి అధికారాన్ని దూరం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఇప్పటికే వైసీపీ కి మీడియా సపోర్ట్ లేదు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో పాజిటివ్ కోణాలను జనాల్లోకి తీసుకువెళ్ళకుండా, చిన్న చిన్న లోపాలను సైతం ఎత్తి చూపిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడంలో టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా సక్సెస్ అవుతున్నాయి.ఇప్పుడు టిడిపి, జనసేన పార్టీలకు అనుకూలంగా వచ్చిన స్థానాల్లో మెజార్టీ భాగం వైసిపి కి మంచి పట్టు ఉన్న ప్రాంతాలే.
అక్కడ ఓటమి అంటే ఈ విషయాన్ని జగన్ సీరియస్ గా ఆలోచించాల్సిందే.