ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నివాసంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.జాతిపిత వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ నివాసం లో మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ క్రమంలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని జగన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ముఖ్యంగా ఆయన సూచించిన అహింసా మార్గంలో అందరూ నడవాలని కోరుకున్నారు.
ఇదిలా ఉంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వానికి మరియు స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ చాలావరకు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వైసిపి ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు.
ఇదే క్రమంలో తనపై విమర్శలు చేసే వారి విషయం గురించి ఒక పక్క గవర్నర్ కి లెటర్లు ద్వారా తెలియజేస్తూనే మరోపక్క కోర్టులకు వెళ్లే ఆలోచనలో నిమ్మగడ్డ ఉన్నట్టు సమాచారం.