రాజకీయంగా ఎదురవుతున్న అన్ని ఇబ్బందులను అధిగమించి, బలమైన పార్టీగా ఉన్న టిడిపి, వైసిపి లకు ధిటు గా జనసేన ను బలోపేతం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తూ, ఇక్కడే ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తున్నారు.అందుకే గత కొద్ది నెలలుగా ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పర్యటిస్తూ , ప్రజా ఉద్యమాలను చేపడుతూ, ప్రజలలో బలం పెంచుకుని బలమైన రాజకీయ పార్టీగా జనసేన ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ధీటుగా జనసేన తరపున పవన్ వాయిస్ వినిపిస్తున్నారు.రైతు పరమర్శల పేరుతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అనేక టూర్లు పవన్ చేశారు.
అయితే ఇదంతా త్వరలో తిరుపతి లో జరగబోయే లోక్ సభ ఉప ఎన్నికల గురించి అనేది బహిరంగ రహస్యం.
ఇక్కడ బిజెపి సహకారంతో జనసేన అభ్యర్థిని రంగంలోకి దింపి, జనసేన రాజకీయానికి ఇబ్బంది లేకుండా చేసుకోవాలనే ఆలోచనతో పవన్ ఉన్నారు.
అయితే ఇక్కడ బిజెపి సైతం తమ అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తుండటంతో, ఆ పార్టీకి అవకాశం లేకుండా చేయాలని, ఈ విషయంలో ఎటువంటి మొహమాటం పడకూడదనే అభిప్రాయంతో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించబోతున్నారు.
ఈ సమావేశం ఈనెల 21 న జరగనుంది.దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు కీలక నాయకులు పాల్గొన బోతున్నారు.
ఈ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నిక సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
అంతే కాకుండా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును సైతం ఫైనల్ చేసుకుని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఏది ఏమైనా తిరుపతి ఎన్నిక విషయంలో బీజేపీ ని సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్లాలనే ఆలోచనతో జనసేన ఉన్నట్లుగా అర్థం అవుతోంది.