ఏపీ తెలంగాణలో ఇప్పుడే అసలు సిసలైన రాజకీయ క్రీడ మొదలైంది.ఈ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్ జగన్ ఇద్దరు మంచి రాజకీయ మిత్రులు.
ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ సహకరించుకుంటూ, పార్టీల పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విషయాల్లో కలిసి మెలసి ముందుకు వెళుతూ, రాజకీయంగా ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఈ ఇద్దరికీ ఒకప్పుడు ఉమ్మడి శత్రువుగా ఉన్న తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనం చేయడంలో సక్సెస్ అయ్యారు.
తెలంగాణలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది.ఏపీలో కాస్తో కూస్తో బలంగానే ఉన్నా, రాజకీయంగా ఎదురు దెబ్బలు తింటోంది.
అప్పుడప్పుడు రాజకీయ విషయాలపై తెలంగాణ నేతలు స్పందిస్తూ, టిడిపిపై విమర్శలు చేస్తూ, చంద్రబాబు అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు.
ఇది ఇలా ఉంటే మొదట్లో టిఆర్ఎస్, వైసీపీ ప్రభుత్వాల విషయంలో సానుకూలంగా ఉంటూ వచ్చిన కేంద్ర అధికార పార్టీ బిజెపి ఈ రెండు ప్రభుత్వాలకు పూర్తిగా సహకారం అందిస్తూ, తగిన సహకారం తీసుకుంటూ కేంద్రం లో ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు పొందుతూ, ఒకరికొకరు సహకరించుకుంటూ వచ్చారు.
రాష్ట్రాలకు సంబంధించిన విషయాలలోనూ బిజెపి అన్ని రకాలుగా సహకరించుకుంటూ ఏపీ లో 2019 ఎన్నికలలో బిజెపి పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి సహకరించిందనే టాక్ సైతం నడిచింది.కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి తారుమారైంది.
ఏపీ, తెలంగాణలలో బిజెపి పట్టు పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణ, ఏపీలో రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలనే విషయంపై పూర్తిగా బిజెపి దృష్టి పెట్టింది.తెలంగాణలో ఆ తరహా రాజకీయం వర్కవుట్ అవుతున్నట్లుగానే కనిపిస్తోంది.ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలలో బిజెపి తన సత్తా చాటుకుంది.
ఇప్పుడు టిఆర్ఎస్ తో సై అంటే సై అన్నట్లుగా వ్యవహారం చేస్తోంది.తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కకు నెట్టి, బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించడమే కాకుండా, కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేసి, టిఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ స్థాయిలోనే బలహీనం చేసేందుకు పెద్ద ఎత్తున చేరికలకు ప్రోత్సహిస్తూ, తెలంగాణ బిజెపి నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
దీనికి కేంద్ర బిజెపి పెద్దలు సైతం తగిన సహకారం అందిస్తూ వస్తున్నారు.
కొద్ది రోజులుగా బిజెపి పూర్తిగా ఏపీ ప్రభుత్వంని టార్గెట్ చేసుకుంది.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఉండడంతోపాటు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో బిజెపి పూర్తిగా వైసీపీ ని టార్గెట్ చేసుకుంది.దీనికి తోడు విగ్రహాల ధ్వంసం జరుగుతుండడం ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పావులు కదుపుతోంది.
క్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభావాన్ని తగ్గించి, వైసిపికి ప్రధాన రాజకీయ శత్రువు బిజెపి అనే విధంగా జనాల్లో పలుకుబడి పెంచుకునే అంశం పైన బిజెపి దృష్టిపెట్టింది.అయితే అటు టిఆర్ఎస్ కానీ, ఇటు వైసిపి కానీ, బీజేపీని రాజకీయ శత్రువు గానే చూస్తున్నారు.
కాకపోతే ఆ శత్రుత్వం రాష్ట్రం వరకే పరిమితం అన్నట్లుగా రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు.కేంద్రంతో భవిష్యత్తులో ఉండే అవసరాల దృష్ట్యా ఆ పార్టీ అగ్రనేత లను విమర్శించేందుకు రెండు పార్టీల నాయకులు సాహసించడం లేదు.
కేవలం రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే తమ ప్రతాపం చూపిస్తూ ప్రియమైన శత్రువు బిజెపి అన్నట్లుగా టిఆర్ఎస్ అటు వైసిపి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.